పవార్, అమిత్‌షా రహస్య భేటీ?

పవార్, అమిత్‌షా రహస్య భేటీ?
హోమ్ మంత్రి అనిల్ దేశముఖ్ ప్రతి నెలా రూ 100 కోట్లు ముడుపులు వసూలు చేసి ఇవ్వమని ఎన్ఐఎ అరెస్ట్ చేసిన పోలీస్ అధికారిని కోరారంటూ మాజీ ముంబై పోలీస్ కమీషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలతో మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం తారాస్థాయికి చేరుకున్నది.
 
ఈ నేపథ్యంలో ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా భేటీ అయినట్లు వచ్చిన వార్తలు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. తమ మధ్య జరిగిన రహస్య సమావేశాన్ని ధ్రువీకరించేందుకు లేదా తిరస్కరించేందుకు అమిత్‌షా నిరాకరించడం గమనార్హం. 
 
అహ్మదాబాద్‌లో శనివారం పవార్‌తో భేటీ జరిగిందన్న దానిపై మీడియా ప్రశ్నించడంతో  తొలుత ప్రశ్నార్థకంగా ముఖం పెట్టిన అమిత్‌షా అనంతరం తేరుకుని.. ‘ప్రతిదీ బహిరంగపరచవలసిన అవసరం లేదు’ అని చెప్పారు. భేటీ జరిగిన విషయాన్ని మీడియా పదే పదే ప్రశ్నించినా ఆయన ధ్రువీకరించలేదు. అదే సమయంలో కాదని చెప్పలేదు. 

ముఖేష్ అంబానీ ఇంటికి సమీపంలో భద్రతా భయంతో సంబంధం ఉన్న ఘటన వెల్లడిపై అప్రాధాన్య పోస్టింగ్‌కు బదిలీ అయిన పరంబీర్‌ సింగ్  ఆ మరుసటి రోజున ముంబైలోని బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి నెలకు రూ.100 కోట్లు కలెక్ట్‌ చేసి ఇవ్వాలంటూ పోలీసులను ఒత్తిడి చేశాడని తీవ్ర ఆరోపణలు చేశారు. తన బదిలీని సవాల్ చేయడంతో పాటు తాను చేసిన అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్ట్ ను కూడా ఆశ్రయించారు. 

గుజరాత్‌లోని స్థానిక వార్తాపత్రికల ప్రకారం శరద్‌ పవార్, అతడి పార్టీ సహోద్యోగి ప్రఫుల్ పటేల్ అమిత్ షాను అహ్మదాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో శనివారం కలిశారు. ఈ ఆరోపణలు దృష్ట్యా ఎన్సీపీకి చెందిన హోమ్ మంత్రి రాజీనామా చేయవలసిందే  అని డిమాండ్ చేస్తూ ఉండడంతో, వీరి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. 

ఇలాఉండగా, హోంమంత్రిపై మాజీ పోలీసు కమిషనర్‌ చేసిన ఆరోపణలపై రిటైర్డ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. ఈ కూటమిలో మరో భాగస్వామి అయినా కాంగ్రెస్ హోమ్ మంత్రి వ్యవహారంపై మౌనం  వహిస్తుండగా, ముఖ్యమంత్రి సహితం ఆయనను మంత్రివర్గం నుండి తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. 

న్యాయ విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు  హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఇలా విచారణ జరిపించాలని తానే స్వయంగా సీఎం ఉద్ధవ్‌ను కోరినట్లు దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఈ విచారణతో నిజానిజాలు బయటికి వస్తాయని దేశ్‌ముఖ్ వ్యాఖ్యానించారు.  శరద్ పవర్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే గత వారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో భేటీ కావడం గమనార్హం. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే సంచలన ప్రకటన చేశారు.