మూడేండ్ల‌లో ప‌ల్లెల‌కు ఈ-ఓటింగ్

వ‌చ్చే మూడేండ్ల‌లో అంటే, 2024 ఎన్నిక‌ల నాటికి మారుమూల ప్రాంత ప్రజలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ (ఈ-ఓటింగ్‌) సౌలభ్యం అందుబాటులోకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం కేంద్ర‌ ఎన్నికల సంఘం కసరత్తు మొద‌లు పెట్టింది.

హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకడామీలో జరిగిన ప్రొబేషనర్‌ ఐపీఎస్‌ అధికారుల స‌ద‌స్సులో కేంద్ర‌ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా మాట్లాడుతూ ఈ విష‌య‌మై ఐఐటీ- మద్రాస్‌తో కలిసి బ్లాక్‌చైన్ టెక్నాల‌జీపై పనిచేస్తున్నట్లు తెలిపారు.

2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఎన్నికల ప్రక్రియలో పలు మార్పులు జరగనున్నాయని సునీల్‌ అరోరా తెలిపారు. అందులో ఈ-ఓటింగ్‌ కూడా ఒకటి అని పేర్కొన్నారు. ఇందుకోసం ఐఐటీ- మద్రాస్‌, ఇతర ప్రముఖ శాస్త్రవేత్తలతో చర్చిస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే ఆధార్‌తో ఓటర్‌ కార్డును జత చేసే అంశంపై కూడా పని చేస్తున్నామని తెలిపారు.

‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ సాధ్యం కావాలంటే ఇప్పుడున్న చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంటుందని సునీల్ అరోరా తెలిపారు. అందుకు రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం అవసరమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

శిక్షణలో ఉన్న పోలీసు అధికారులను ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు పంప‌డాన్ని ప్ర‌శంసించారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అందుకోసం ఇద్దరు సీనియర్‌ అధికారులను నియమించినట్లు తెలిపారు.