టాటా గ్రూప్‌కి సుప్రీంకోర్టులో భారీ ఊరట

టాటా గ్రూప్‌కి ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌‌గా సైరస్ మిస్త్రీని పునర్నియమిస్తూ ఎన్ఎస్ఎల్ఏటీ ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత ధర్మాసనం పక్కనబెట్టింది. టాటా గ్రూప్ వేసిన అన్ని పిటిషన్లను స్వీకరించింది. 

చట్టపరమైన అన్ని ప్రశ్నలు టాటా గ్రూప్‌కి అనుకూలంగా ఉన్నాయని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మిస్త్రీ దాఖలు చేసిన అన్ని పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.

2016 అక్టోబర్ 24న మిస్త్రీని తొలగిస్తూ టాటా సన్స్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కాగా 2016 అక్టోబర్ 24న బోర్డు మీటింగ్ సందర్భంగా మిస్త్రీ పరిపాలన విధాన ముసాయిదాను ప్రవేశపెట్టబోయారనీ.. అందుకే ఆయనను తొలగించారంటూ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఆరోపించింది. 

అయితే ఈ ఆరోపణలతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించలేదు. 2016 అక్టోబర్ 24న సమావేశమైన టాటా సన్స్ బోర్డు.. మిస్త్రీని చైర్ పర్సన్ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం చట్టవిరుద్ధమంటూ 2019 డిసెంబర్లో ఎన్‌సీఎల్ఏటీ తీర్పు వెలువరించింది. 

ఆ తీర్పును ర‌త‌న్ టాటా మెచ్చుకున్నారు. అత్యున్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు ప‌ట్ల‌ ఆయ‌న ట్విట్టర్ ద్వారా  కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇది గెలుపు, ఓట‌ముల అంశం కాదు అని, త‌న స‌మ‌గ్ర‌త‌పై నిరంతరం దాడి జ‌రిగింద‌ని, టాటా గ్రూపు నైతిక‌త‌పై కూడా దాడి జ‌రిగింద‌ని ర‌త‌న్ త‌న ట్వీట్‌లో తెలిపారు.

సుప్రీం ఇచ్చి తీర్పు.. సంస్థ‌లో ఉన్న నైతిక విలువుల‌కు, ప్ర‌మాణాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తుంద‌ని ర‌త‌న్ పేర్కొన్నారు. సుప్రీం తీర్పు నిష్ప‌క్ష‌త‌ను, న్యాయ‌వ్య‌వ‌స్థపై న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

ఇక షేర్ల విష‌యాన్ని మ‌రో న్యాయ ప్ర‌క్రియ‌లో తేల్చుకోవాల‌ని కూడా టాటా గ్రూప్‌, సైర‌స్ మిస్త్రీల‌కు సుప్రీంకోర్టు సూచించింది. 2012లో ర‌త‌న్ టాటా త‌ర్వాత టాటా స‌న్స్ చైర్మ‌న్ అయిన సైర‌స్ మిస్త్రీని 2016లో బోర్డు తొల‌గించింది. టాటా స‌న్స్‌లో మిస్త్రీ కుటుంబానికి 18.37 శాతం వాటా ఉంది.