ఇటీవల భారీ స్థాయిలో పతనమైన రూపాయి విలువ సోమవారం కాస్త కోలుకుంది. నేటి ట్రేడింగ్లో 40 పైసలు పెరిగి 95.20గా ట్రేడ్ అయింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఖరారయ్యే అవకాశాలున్నట్లు వార్తలు రావడంతో చమురు మంటలు కాస్త చల్లారాయి. దీంతో మన కరెన్సీ కాస్త బలపడింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, చమురు మంటలు తదితర కారణాలతో ఇటీవల మన దేశీయ కరెన్సీ రూపాయి విలువ భారీగా పడిపోయిన సంగతి విదితమే.
డాలర్తో పోలిస్తే రూపాయి దాదాపు 100 మార్క్ దిశగా పతనమయ్యింది. దీనిపై తాజాగా ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రూపాయి ఓవర్ వ్యాల్యూగా ఉందని అనలేమని, వాస్తవిక విలువ కంటే తక్కువగా ట్రేడ్ అవుతోందని మాత్రం చెప్పగలమని పేర్కొన్నారు. రూపాయి విలువకు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట మారకపు రేటు స్థాయిని ఆర్బిఐ లక్ష్యంగా పెట్టుకోదని సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
అసలు అలాంటి విషయాల్లో కేంద్ర బ్యాంకు ఎలాంటి జోక్యం చేసుకోబోదని తెలిపారు. అయితే, ఊహాజనిత కదలికలు లేదా అధిక అస్థిరతను అరికట్టడానికి మాత్రమే విదేశీ మారక ద్రవ్య ఎక్స్ఛేంజీ మార్కెట్లో ఆర్బిఐ జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. మన రూపాయికి ఒక నిర్దిష్ట విలువను సెట్ చేయడం కంటే.. కరెన్సీ మార్కెట్ను స్థిరంగా ఉంచడానికే తాము ప్రాధాన్యమిస్తామని ఆర్బిఐ గవర్నర్ వివరించారు.
అంతర్జాతీయంగా అస్థిరత, చమురు ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ మన దేశ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ స్థిరంగా ఉన్నాయని సంజయ్ మల్హోత్రా తెలిపారు. విదేశీ సంస్థాగత మదుపర్ల నుంచి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. మన కరెన్సీ విలువను స్థిరంగా ఉంచేందుకు దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు.

More Stories
మేలో 9.68 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం
ట్రంప్ ప్రకటనతో తగ్గిన చమురు ధరలు… స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు
భారత్ విజయాలను `తక్కువ చేసి’ చూపే రాహుల్ ప్రయత్నం