బెంగాల్ అభివృద్ధిపై మమతకు ఆసక్తి లేదు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీకు రాష్ట్రాభివృద్ధిపై ఏమాత్రం ఆసక్తి లేదని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

‘‘గూండాలు, దోపిడీదారులకు కొమ్ము కాయడమే’’ ఆమె పనిగా పెట్టుకున్నారంటూ దుయ్యబట్టారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పాలన ముగిసేందుకు కౌంట్‌డౌన్ మొదలైందని యోగి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి శకాన్ని ప్రారంభిస్తూ 35 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. 

ఇవాళ దక్షిణ 24 పరగణాల జిల్లా సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ ర్యాలీలో యోగి ప్రసంగిస్తూ.. ‘‘పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు అభివృద్ధిలో ముందుండేది. అయితే కాంగ్రెస్, వామ పక్షం, టీఎంసీ పార్టీలు రాష్ట్రంలోని పారిశ్రామిక అభివృద్ధిని కూల్చేశాయి. అవినీతికి దారులు తెరిచాయి…’’ అని ఆరోపించారు.

కేంద్రం విడుదల చేసిన నిధులను టీఎంసీ దోచుకుందనీ.. ఆంఫన్ తుపాను నిధులను కూడా అదే రీతిగా మాయం చేశారని ఆయన విమర్శించారు. ‘‘ఆంఫన్ తుపాను తర్వాత రాష్ట్రానికి ప్రధాని మోదీ రూ. 1000 కోట్ల సాయం పంపారు. కానీ ఆ డబ్బులు ప్రజలకు అందలేదు. టీఎంసీ నేతలే వాటిని దోచుకున్నారు…’’ అని యూపీ సీఎం ఆరోపించారు. 

పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల పథకం, ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ నిధి తదితర కేంద్ర పథకాల ద్వారా యూపీ ప్రజలు లబ్ధి పొందుతున్నప్పుడు… ఆ పథకాలు పశ్చిమ బెంగాల్ ప్రజలకు అందుకుండా ఎందుకు దూరం పెడుతున్నారంటూ యోగి ప్రశ్నించారు. ‘‘పశ్చిమ బెంగాల్ అభివృద్ధి పట్ల టీఎంసీకి చిత్తశుద్ధి లేదు అని చెప్పేందుకు ఇదే నిదర్శనం…’’ అని ఆయన దయ్యబట్టారు.