చిదంబరంకు ఢిల్లీ కోర్టు నోటీసులు

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం సహా ఐఎన్‌ఎక్స్ మీడియా మేనేజ్‌మెంట్‌లో ఉన్నవారు, మరికొంత మందికి ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు పంపింది. 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అందించిన చార్జ్‌షీట్ పరిశీలించిన ఢిల్లీ కోర్టు.. నిందితులందరినీ ఏప్రిల్ 7, 2021న తమ ముందు హాజరు కావాలని ధర్మాసనం పేర్కొంది.

ఐఎన్‌ఎక్స్ మీడియాకు సంబంధించిన కేసులో కార్తీ చిదంబరం సహా పలువురు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఐఎన్ఎక్స్‌కు లబ్ధి చేకూర్చడానికి విదేశీ పెట్టుబడులను ఆమోదించిన ఫారెన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ ఎన్నో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. 

ఈ కంపెనీకి పెట్టుబడులు ఆమోదించిన సమయంలో పి.చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నారు. అయితే మీడియా కంపెనీ ఐఎన్ఎక్స్‌పై 2017 మే 15న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో  చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఆయన ఆధ్వర్యంలో పనిచేసే చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు, మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులను ఇందులో నిందితులుగా పేర్కొన్నారు. ఇందులో చిదంబరం పేరు లేకపోవడం గమనార్హం.