శబరిమలకు కొత్త చట్టం.. బీజేపీ మ్యానిఫెస్టో

శబరిమల కోసం ప్రత్యేక చట్టం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే మ్యానిఫెస్టోను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ బుధవారం విడుదల చేశారు. కేరళ సంపూర్ణ అభివృద్ధిపై తమ మ్యానిఫెస్టో దృష్టిసారించిందని తెలిపారు. 

ఉద్యోగాల కల్పన, ఆకలి, భీభత్స రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం, శబరిమల, లవ్‌ జిహాద్‌పై ప్రత్యేక చట్టం, హైస్కూల్‌ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు వంటి హామీలను ప్రకటించారు.

కుటుంబానికి కనీసం ఒక ఉద్యోగం, బీపీఎల్ కుటుంబాలకు 6 ఉచిత సిలిండెర్లు, హైస్కూలు విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు వంటి హామీలను బీజేపీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. 

అందరికీ ఇళ్లు, తాగునీరు, విద్యుత్ కల్పన, లవ్‌ జీహాద్‌కు చరమగీతం పాడుతూ చట్టం, అన్ని రంగాల్లోనూ కనీస వేతనాలు, కుటుంబ పోషకుడు జబ్బుపడి, పనిచేయని పరిస్థితి ఉంటే ఆ కుటుంబానికి నెలనెలా రూ.5,000 ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించింది. సామాజిక సంక్షేమ పింఛన్లు రూ.3,500కు పెంచుతామని హామీ ఇచ్చింది.

కేరళలో సీపీఎం, కాంగ్రెస్‌ మధ్య విభేదాలు నాటకమని ప్రకాష్‌ జవదేకర్‌ ఈ సందర్భంగా విమర్శించారు. బెంగాల్‌లో వాహపక్షాలతో కాంగ్రెస్‌ దోస్తి, కేరళలో కుస్తి అని ఎద్దేవా చేశారు. బీజేపీ మేనిఫెస్టోను అత్యంత సాహసోపేతమైన, ప్రగతిశీలక, అభివృద్ధి దాయక మేనిఫెస్టోగా జవదేకర్ అభివర్ణించారు.