ఆధార్, పాన్ అనుసంధానం చేయించకపోతే జరిమానా

ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) అనుసంధానానికి చివరి తేదీ ఈ నెల 31. ఈ గడువులోగా వీటిని అనుసంధానం చేయించకపోతే పాన్ చెల్లనిదవుతుంది. అంతేకాకుండా రూ.1,000 వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. లోక్‌సభ మంగళవారం ఆమోదించిన ఆర్థిక బిల్లు, 2021లో ఈ నిబంధనలు ఉన్నాయి.

ఫైనాన్స్ బిల్లులోని సెక్షన్ 139ఏఏ(2) ప్రకారం ఆధార్‌ సంఖ్యను తెలియజేయాలని ఏ వ్యక్తినైనా కోరినపుడు, ఆ వ్యక్తి ఆ విధంగా తన ఆధార్ సంఖ్యను తెలియజేయడంలో విఫలమైతే, గరిష్ఠంగా రూ.1,000 వరకు రుసుమును చెల్లించవలసి ఉంటుంది. 

ఈ విధంగా రుసుమును విధించేందుకు అవకాశం కల్పిస్తూ ఈ బిల్లులో సెక్షన్ 234హెచ్‌ను కొత్తగా ప్రవేశపెట్టారు. మార్చి 31నాటికి ఆధార్, పాన్‌లను తప్పనిసరిగా అనుసంధానం చేయించుకోవాలి. ఆధార్‌ను మెయింటెయిన్ చేయకపోతే పాన్ పని చేయదు. ఫలితంగా ఎదుర్కొనవలసిన పర్యవసానాలకు అదనంగా ఈ రుసుమును చెల్లించాలి. 

రూల్ 114ఏఏఏ ప్రకారం, పాన్‌ను తెలియజేయాలని ఏ వ్యక్తినైనా అధికారులు కోరినపుడు, ఆ వ్యక్తి పాన్ పనిచేయని స్థితిలో ఉంటే, ఆ వ్యక్తి తన పాన్‌ను సమర్పించలేదని పరిగణిస్తారు. 

ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ నిబంధనల ప్రకారం, ఏ వ్యక్తినైనా తన పాన్‌ను సమర్పించాలని అధికారులు కోరినపుడు, ఆ వ్యక్తి తన పాన్‌ను సమర్పించకపోయినా, పని చేయని పాన్‌ను సమర్పించినా, ఆ వ్యక్తి అధిక టీడీఎస్ (మూలంలో పన్ను తగ్గింపు)ను లేదా టీసీఎస్ (మూలం వద్ద పన్ను వసూలు)ను చెల్లించవలసి ఉంటుంది. ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్‌ను దాఖలు చేయడం సాధ్యం కాకపోవచ్చు, దాని పర్యవసానాలను ఎదుర్కొనవలసి వస్తుంది.