సీఏఏ తెస్తాం, బంగారు బంగ్లా సాకారం చేస్తాం

పశ్చిమబెంగాల్ లో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు కోసం వ్యూహాత్మకంగా, ఉధృతమైన ఎన్నికల ప్రచారం చేస్తున్న  భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆదివారం కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో  విడుదల చేశారు.

తమ మేనిఫెస్టోను ‘సంకల్ప్ పాత్ర’గా పిలవాలని పార్టీ నిర్ణయించినట్టు అమిత్‌షా ఈ సందర్భంగా సూచించారు. ఇది కేవలం మేనిఫెస్టో కాదని, దేశంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ పశ్చిమబెంగాల్‌ కోసం చేసిన తీర్మాన పత్రం (రిజల్యూషన్ లెటర్) అని తెలిపారు.

బంగారు బంగ్లాగా బెంగాల్‌ను తీర్చిదిద్దడమే బీజేపీ ప్రధాని లక్ష్యమని అమిత్ షా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో ఇంటింటికి ఒక ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకూ మహిళలకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. చొరబాటుదార్లను రాష్ట్రంలోని అనుమతించేది లేదని స్పష్టం చేశారు. సరిహద్దు పెన్సింగ్‌ను పటిష్టం చేస్తామని చెప్పారు.

తొలి మంత్రివర్గ సమావేశంలోని పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేస్తామని, 70 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న శరణార్థులకు పౌరసత్వం ఇస్తామని అమిత్ షా ప్రకటించారు . ఒక్కో శరణార్థి కుటుంబానికి ఐదేళ్ల పాటు ఏడాదికి రూ.10,000 నగదు అందిస్తామని వెల్లడించారు. 

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కొనసాగిస్తామని, మూడేళ్లుగా రైతులకు మమతా బెనర్జీ దీనిని అమలు చేయడం లేదని, 75 లక్షల మంది రైతులకు ఎలాంటి కోతా లేకుండా రూ.18,000 చొప్పునవారి అకౌంట్లకు నేరుగా బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏటా రైతులకు కేంద్రం ఇచ్చే రూ.6000కు రాష్ట్రం తరఫున మరో రూ.4000 కలిపి మొత్తం రూ.10,000 చొప్పున రైతుల ఖాతాల్లో వేయనున్నట్టు తెలిపారు. మత్సకారులకు కూడా ఏటా రూ.6000 చొప్పున వారి ఖాతాల్లో వేస్తామని చెప్పారు.

రూ.11,000 కోట్లతో సోనార్ బంగ్లా నిధిని ఏర్పాటు చేసి కళలు, సాహిత్యాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. తమ మేనిఫెస్టోలో మహిళల రక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి, ఆరోగ్య సేవలు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అమిత్‌షా తెలిపారు. దేశంలో మహిళలకు రక్షణలేని రాష్ట్రాల్లో బెంగాల్ మొదటిస్థానంలో ఉన్నదని షా విమర్శించారు. మమత పదేళ్ల పాలనలో రాష్ట్రంలో అవినీతి, రాజకీయ హింస పెరిగాయని ధ్వజమెత్తారు.

బెంగాల్‌లో జరిగిన రాజకీయ హత్యలపై సిట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బాధితులకు రూ.25 లక్షల వరకు పునరావాసం కింద ఇవ్వనున్నట్టు తెలిపారు. బెంగాల్‌లోకి చొరబాట్లను అరికట్టేందుకు సరిహద్దులో ఫెన్సింగ్‌ను పటిష్టం చేయనున్నట్టు తెలిపారు. చాలా మంచి హామీలను ఇచ్చామని, వీటి ద్వారానే తమ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.