టీఎంసీ ఆరోపణలను తోసిపుచ్చిన ఈసీ

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో రాష్ట్ర పోలీసులపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని ఎన్నికల కమిషన్ (ఈసీ) స్పష్టం చేసింది. పోలింగ్ బూత్‌లకు 100 మీటర్ల పరిధిలో రాష్ట్ర పోలీసులు ఉండకూడదనే ఆదేశాలేవీ తాము ఇవ్వలేదని తెలిపింది.

రాష్ట్ర పోలీసులు పోలింగ్ బూత్‌ల నుంచి 100 మీటర్ల దూరంలో ఉండాలని ఈసీ ఆదేశించిందని టీఎంసీ ఆరోపించిన నేపథ్యంలో ఈసీ ఈ వివరణ ఇచ్చింది. టీఎంసీ ఆరోపణలను ఖండిస్తూ, పశ్చిమ బెంగాల్ పోలీసులపై తాము ఎటువంటి ఆంక్షలను విధించలేదని తెలిపింది. 

తమ ఆదేశాలు కేవలం సాధారణ పోలీసులకు సహాయపడుతున్న సివిక్ పోలీసులకు మాత్రమే వర్తిస్తాయని తెలిపింది. అంతకుముందు టీఎంసీ నేతల బృందం ఈసీని కలిసింది.

పశ్చిమ బెంగాల్‌లో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, పారదర్శక ఎన్నికలు వాస్తవ దూరం అవుతున్నాయని ఆరోపించింది. పోలింగ్ బూత్‌లకు 100 మీటర్ల పరిధిలో రాష్ట్ర పోలీసులు ఉండకూడదని ఈసీ ఆదేశించడం తగదని చెప్పింది. ఈ బృందంలో సౌగత రాయ్, యశ్వంత్ సిన్హా, ప్రతిమ మొండల్, మహువా మొయిత్రా తదితరులు ఉన్నారు.