చైనా వ్యాక్సిన్ లు వేసుకొంటేనే చైనా వీసాలు

చైనాలో తయారైన కరోనా వ్యాక్సిన్ ల పట్ల అంతర్జాతీయంగా విముఖత వ్యక్తం అవుతూ ఉండటం, ఎవ్వరు వాటిని వేసుకోవడానికి ముందుకు రాకపోతు ఉండడంతో చైనా ప్రభుత్వం సరికొత్త నిబంధనను తీసుకు వచ్చింది. తమ దేశంలో తయారైన వ్యాక్సిన్ లు వేసుకొంటేనే తమ దేశం రావడానికి వీసాలను అనుమతిస్తామని ప్రకటించింది. 

వ్యాపార లావాదేవీలు, తమ దేశంలో చిక్కుకుపోయిన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు, ఇతరత్రా కారణాలతో చైనాను సందర్శించాలనుకునే వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అమెరికాలోని చైనీస్‌ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 

వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుందని, ఒకవేళ ఒక షాట్‌ తీసుకున్న వాళ్లు 14 రోజుల తర్వాత వీసాకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు దేశంలో అడుగుపెట్టిన తర్వాత మూడు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. 

భారత్‌, పాకిస్తాన్‌, ఫిలిప్పైన్స్‌, ఇటలీ, శ్రీలంక తదితర దేశాల్లోని చైనా ఎంబసీలు కూడా ఇదే తరహా ప్రకటన విడుదల చేశాయి. కాగా చైనాలోని వుహాన్‌లో తొలుత కరోనా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో డ్రాగన్‌ దేశంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

చైనీయుల ఆహరపుటలవాట్ల వల్లే వైరస్‌ వ్యాప్తి చెందిందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా ఇతర దేశాధినేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో చైనాలో తయారైన వ్యాక్సిన్ల వినియోగం పట్ల కూడా చాలా దేశాలు విముఖత వ్యక్తం చేశాయి. డ్రాగన్‌ దేశం తయారు చేసిన టీకాలు ప్రభావంతంగా పనిచేస్తాయా లేదా అని సందేహాలు వ్యక్తం చేశాయి. ఆ టీకాలు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చైనా వెల్లడించక పోవడమే అందుకు కారణం. 

ఈ క్రమంలో, తాజా ప్రకటన నేపథ్యంలో  చైనా తమ వ్యాక్సిన్లను ఈ విధంగా మార్కెటింగ్‌ చేసుకోవాలని చూస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా రూపు మార్చుకుని ప్రబలుతున్న తరుణంలో అంతర్జాతీయ ప్రయాణాలు వాయిదా వేసుకుంటేనే మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఇక ఇప్పటివరకు దేశీయంగా తయారు చేసిన నాలుగు వాక్సిన్ల ఉపయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన చైనా, దేశ వ్యాప్తంగా వాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టింది. 

చైనాలో 65 మిలియన్ వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చినట్లు చెప్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా చైనీస్ తయారీ వ్యాక్సిన్‌ను తీసుకునేవిధంగా గట్టి చర్యలు తీసుకుంటోంది. అయితే చైనా తయారీ వ్యాక్సిన్లపై జరిగిన క్లినికల్ ట్రయల్స్ సమాచారం పారదర్శకంగా లేదు. కాబట్టి చాలా దేశాలు చైనా వ్యాక్సిన్లపై ఆసక్తి చూపడం లేదు.

దాదాపు 22 వేల మంది భారతీయ విద్యార్థులు చైనాలో చదువుతున్నారు. వీరంతా ప్రస్తుతం మన దేశంలోనే ఉన్నారు. వీరిని తిరిగి చైనాలోకి అనుమతించడంపై చైనా ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. 
 
మంగళవారం ప్రకటించిన వీసా విధానంలో విద్యార్థుల కోసం సడలింపులు ఇవ్వడం గురించి వివరాలు లేవు. భారత ప్రభుత్వ అనుమతి లేకుండా చైనీస్ వ్యాక్సిన్లను చైనీస్ ఎంబసీ కానీ, కాన్సులేట్లు కానీ ఇవ్వడం సాధ్యం కాదు. ఈ అంశంపై భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయో, లేదో చైనా ప్రభుత్వం వెల్లడించ లేదు. 
 
 మరోవంక, రష్యా టీకాలను తిరస్కరించాలంటూ కొన్ని దేశాలపై అసాధారణ రీతిలో ఒత్తిడి పెరుగుతోందని రష్యా వెల్లడించింది. టీకాలను తిరస్కరించాలనే ఇటువంటి స్వార్థపూరిన డిమాండ్లకు ఎటువంటి భవిష్యత్తూ ఉండదని రష్యా ప్రభుత్వ ప్రతినిధి మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా టీకాను తిరస్కరించాలంటూ అమెరికా బ్రెజిల్‌పై ఒత్తిడి తెచ్చిందన్న వార్తల నేపథ్యంలో రష్యా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.