మంత్రి మాటలకు ప్రభుత్వ వైద్యురాలు కంట తడి! 

రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ మాటలకు ఓ ప్రభుత్వ వైద్యురాలు కంటతడి పెట్టిన సంఘటన  అనంతపురం జిల్లాలో జరిగింది.  సరిపడా సిబ్బంది లేకున్నా… విధులు నిర్వహిస్తూ.. రాష్ట్రంలోనే మంచి ర్యాంకు సాధించిన తమపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై సస్పెన్షన్‌ వేటు వేసినా తాము సిద్ధమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం రాత్రి సోమందేపల్లి మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో నీళ్ల సమస్యతో ఇరుగు పొరుగు వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన వెంకటేశ్, తరుణ్ గాయాలపాలయ్యారు. వీరు అదే రాత్రి 11.30 కు పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. వీరిని పరామర్శించేందుకు మంత్రి శంకర్ నారాయణ ఆసుపత్రికి సోమవారం వచ్చారు.
ఈ నేపథ్యంలో వైద్యుల విధులు, ఆసుపత్రి సౌకర్యాలపై ఆరా తీశారు. దీంతో అక్కడున్న వైద్యులపై అంతెత్తుకు లేచారు. వైద్యులు సకాలంలో స్పందించడం లేదని, ప్రైవేటు క్లినిక్ లు పెట్టుకొని ఉన్నారని మండిపడ్డారు. వెంటనే మెమోలు జారీ చేయాలంటూ వైద్యశాఖ ఉన్నతాధికారులను ఫోన్‌లో ఆదేశించారు. సస్పెండ్ చేయాలని డీసీఎస్‌హెచ్ రమేశ్ నాథ్‌తో మాట్లాడారు.
మంత్రి మాటలకు అక్కడే ఉన్న వైద్యురాలు సుకన్య కంటతడి పెట్టారు. నిజాయితీగా పని చేస్తున్న తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని ఆమె హితవు చెప్పారు. పూర్తి వివరాలు తెలుసుకుని మంత్రి మాట్లాడితే బాగుంటుందని ఆమె సూచించారు. మంత్రి శంకర్ నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బుడం సాహెబ్ఆ రు మంది సిబ్బంది ఉండాల్సిన చోట ఇద్దరు వైద్యులు 24 గంటలు పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  సస్పెండ్ చేసిన తాము సిద్ధమేనని స్పష్టం చేశారు.
ఆసుపత్రుల ర్యాంకింగులో ఎక్కడో ఉన్న తమ ఆసుపత్రిని  ఉన్నతమైన స్థితికి తీసుకు వచ్చామని, రికార్డులు కూడా పరిశీలించొచ్చు అని తెలిపారు. ఎనిమిది గంటల చేయాల్సిన విధులను సిబ్బంది కొరత కారణంగా 24 గంటలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడున్న సౌకర్యాలపై రిపోర్టును పై అధికారులకు పంపామని,  త్వరలోనే అన్నీ సమకూరనున్నాయన్నారని వివరించారు.