తిరుపతి లోక్‌సభకు బిజెపి అభ్యర్థి

చిత్తూరు జిల్లాలోని తిరుపతి లోక్‌సభకు బిజెపి అభ్యర్థి బరిలో దిగనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి వి ‌ మురళీధరన్‌ స్పష్టం చేశారు. బిజెపి అభ్యర్థి గెలుపునకు జనసేన మద్దతు తెలుపుతుందని ఆయన ట్వీట్‌ చేశారు. తిరుపతి నుంచి బీజేపీ విజయయాత్ర మొదలవుతుందని మురళీధరన్‌ ప్రకటించారు.
 
ఈ మేరకు తిరుపతిలో పోటీపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల తెలంగాణలో జరిగిన జివిఎంసి ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా బిజెపికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే తిరుపతి లోక్‌సభ స్థానానికి జనసేన అభ్యర్థిని నిలబెట్టాలని, బిజెపి మద్దతు తెలపాలని పవన్‌కల్యాణ్‌ కోరారు. ఢిల్లీలో రెండు మూడు రోజులు ఉండి బిజెపి పెద్దలతో సైతం పవన్‌ మంతనాలు నడిపారు. కానీ, తాజాగా తిరుపతి లోక్‌సభకు బిజెపి అభ్యర్థి పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు.

ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని బలపరచాలని నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ కూడా  ఒక ప్రకటనలో ‌ వెల్లడించారు. ఆ పార్టీ జాతీయ స్థాయి నాయకులతో పలు దఫాలుగా జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతో్‌షతో లోతైన చర్చ జరిగిందన్నారు. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని వారు గట్టిగా చెప్పారని తెలిపారు. 

‘జనసేన అభ్యర్థి పోటీ చేయడం కంటే తిరుపతి అభివృద్ధి ముఖ్యమని భావించాం. అందరికీ ఆమోదయోగ్యుడైన, బలమైన అభ్యర్థి ఉంటూ తప్పకుండా ఈ స్థానాన్ని బీజేపీకి వదిలిపెడతామని ఆది నుంచీ చెబుతున్నాం. బీజేపీ అభ్యర్థికి విజయం సాధించగల సత్తా ఉందని భావించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. తిరుపతి స్థానాన్ని 1999లో బీజేపీ కైవసం చేసుకున్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం’ అని పవన్ వెల్లడించారు.

ఆలయాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటి రక్షణకు బీజేపీ తగు చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం ఉందని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక శక్తుల పీచమణచడానికి హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల మాదిరిగా తిరుపతిలో పోరాటం చేసేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సమాయత్తమవుతోందని తెలిపారు.

`ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అగ్రనాయకులు పలుమార్లు జరిగిన ఉభయ పార్టీల సమావేశాల్లో స్పష్టం చేశారు. వైసీపీ ఆగడాలకు దీటైన సమాధానం చెబుతామని వారు చెబుతున్నారు’ అని పవన్ వివరించారు. జనసేన పక్షాన మేం ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీ, నాయకులు, జెండా మోసే కార్యకర్తలు సంస్థాగతంగా బలపడడానికేనని గమనిస్తారని భరోసా వ్యక్తం చేశారు.  ‘తిరుపతిపై నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు దూరదృష్టితో ఆలోచిస్తాయని ఆశిస్తున్నాను. తిరుపతిలో విజయం కోసం కృషి చేద్దాం’ అని పిలుపిచ్చారు.

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీయే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విటర్‌లో వెల్లడించారు. జనసేన నేత పవన్‌ కల్యాణ్‌తో జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అభ్యర్ధి ఎవరనే వివరాలను కేంద్ర నాయకత్వం ప్రకటిస్తుందని చెప్పారు.