15 నుంచి నాగ్‌పూర్ కఠిన లాక్‌డౌన్

మహారాష్ట్రలోని నాగ్‌పూర్, సమీప ప్రాంతాలలో ఈ నెల 15వ తేదీ నుంచి కఠినమైన లాక్‌డౌన్‌ను విధిస్తున్నారు. నాగ్‌పూర్, చుట్టుపక్కల ప్రాంతాలలో క్రమేపీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను అమలులోకి తెస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. 
 
ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకూ లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. ప్రజలు అంతా ఖచ్చితంగా నిబంధనల మేరకు వ్యవహరించాలని, లాక్‌డౌన్ కటుతరంగానే ఉంటుందని థాకరే హెచ్చరించారు. దేశంలో మొత్తం మీద కరోనా కేసులు తగ్గుతూ ఉన్నా చాలాకాలంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ రాష్ట్రాలలో కరోనా అదుపులోకి రాకపోవడం కేంద్రాన్ని కలవరపరుస్తోంది. 
 
ఇప్పటికైతే నాగ్‌పూర్, సమీప ప్రాంతాలలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని, ఇక ముందు పరిస్థితిని అంచనావేసుకుని మరికొన్ని ప్రాంతాల్లో కూడా లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా విషయంలో రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు.
 
నాగ్‌పూర్ నగరం, సమీప ప్రాంతాలలో 15వ తేదీ నుంచి వారం రోజుల లాక్‌డౌన్ అమలులోకి వస్తుంది, ఇతర ప్రాంతాలలో కూడా కేసుల సంఖ్య కలవరం కల్గిస్తోందని, అక్కడ కూడా లాక్‌డౌన్ విధించే విషయాన్ని పరిశీలించుకుని వచ్చే రెండు రోజులలో నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 
 
ముంబైలోని జెజె హాస్పిటల్‌లో థాకర్ ఆయన భార్య రష్మీ కొవాగ్జిన్ తొలి డోస్ తీసుకున్నారు. వారి వెంట అత్తయ్య మీనాతాయ్ పతంకర్‌చ వ్యక్తిగత సహాయకులు మిలింద్ నర్వేకర్ కూడా టీకా పొందారు. తరువాత సిఎం విలేకరులతోమాట్లాడుతూ వ్యాక్సినేషన్ విషయంలో ఎటువంటి గందరగోళం లేదని, దీనిని అంతా ఎటువంటి భయాలు లేకుండా తీసుకోవచ్చునని తెలిపారు.
 
రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున, అర్హులైన వారంతా ఎటువంటి సంకోచాలు లేకుండా టీకాలు తీసుకోవాలని, తాను తీసుకున్నానని తెలిపారు. క‌రోనా కేసుల తీవ్ర‌త పెరుగుతుండ‌టంతో.. ఔరంగాబాద్‌లో పోలీసులు నైట్ క‌ర్ఫ్యూ విధించారు. ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు నైట్ కర్ఫ్యూ ఉంటుంద‌ని, నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు.

మహారాష్ట్రలో ఫిబ్రవరి నెలలోనే 1.31 లక్షల మందికి కరోనా సోకింది. అంతకు ముందు 92,177 మందికి వైరస్ రాగా ఇది పెరుగుతూ పోయింది. అయితే కరోనా మృతుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. మహానగరం ముంబైలో యాక్టివ్ కేసు ల సంఖ్య పెరుగుతోంది. 
 
అమరావతి, యవత్‌మాల్, ముంబై, అకోలా, విదర్భ కొ న్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి 9 నుంచి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు లాక్‌డౌన్ విధించే నాగ్‌పూర్‌లో రోజువారి కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే నాగ్‌పూర్‌లో 1710 కేసులు నమోదయ్యాయి.