బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాజీ ఎంపీ అక్బర్ అహ్మద్ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ బీజేపీ ఢిల్లీ ఉపాధ్యక్షురాలు షాజియా ఇమ్లి పోలీసులను ఆశ్రయించారు. ఓ ప్రైవేటు పార్టీలో తనను బెదిరింపులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు.
‘‘సౌత్వెస్ట్ ఢిల్లీలో వసంత్ కుంజ్లో ఫిబ్రవరి 5న జరిగిన ఓ డిన్నర్ పార్టీలో అక్బర్ అహ్మద్ తప్పుగా ప్రవర్తించారు. చేతన్ సేత్ పార్టీకి హాజరైన ఆయన నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. చేతన్ సేత్, ఆయన కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినకుండా నీచంగా వ్యవహరించారు” అని ఆమె ఆరోపించారు.
హిందీలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈ విషయాన్ని బహిరంగ పరచదలచుకో లేదని, కాని అలా అని ఆయనను అలాగే వదిలిపెట్టకూడదని ఆమె స్పష్టం చేశారు. లేదంటే అలాంటి వాళ్లు మరింతగా రెచ్చిపోతారని చెప్పారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు.
పలువురు విదేశీ రాయబారులు, సీనియర్ అధికారులు హాజరైన ఆ విందు సమావేశంలో ఆమె పలువురు ప్రముఖులతో వ్యవసాయ చట్టాలు, ఇతర అంశాల గురించి చర్చిస్తుండగా పదే, అదే ఆమె పట్ల అసభ్యపు వాఖ్యలు చేస్తూ అక్బర్ ఆమెను వెంటాడినట్లు అక్కడున్న ఒక సీనియర్ అధికారి తెలిపారు. చివరకు ఆమె భోజనం చేస్తున్నపుడు కూడా వదిలిపెట్టలేదని చెప్పారు.
ఈ క్రమంలో ఆయనపై సెక్షన్ 506 (బెదిరించడం), 509 (మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించడం) కింద ఫిబ్రవరి 7న కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
More Stories
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల తర్వాత పెరిగిన బీజేపీ గ్రాఫ్
వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
ఇందిరా ఆస్తి పోవద్దనే వారసత్వపు పన్ను రద్దు