1178 రైతుల ట్విట్టర్ ఖాతాలపై కేంద్రం వేటు

ట్విట్టర్ సంస్థకు కేంద్రం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. 1178 ట్విట్టర్ ఖాతాలను బ్లాక్‌ చేయాలని  ట్విట్టర్ ను కేంద్రం కోరింది. గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో రైతుల ట్రా‍క్టర్‌ ర్యాలీలో హింసకు కారణమైన.. ప్రేరేపించిన వారిని గుర్తించి సదరు ట్విట్టర్‌ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని లేఖ రాసింది.
తీవ్రవాద ఖలీస్తాన్ సానుభూతి పరులు, పాకిస్తాన్ తో లింకులున్న  ఖాతాలను బ్లాక్ చేయాలని కోరుతూ ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. హోం మంత్రిత్వ శాఖ  నివేదిక మేరకు ఐటీ  మంత్రిత్వ శాఖ  ఈ నోటీసులు జారీ చేసింది. ఈ అకౌంట్లులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నాయని కేంద్రం ఆరోపిస్తున్నది. 
 భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న రైతుల నిరసనల దృష్ట్యా విదేశాల నుండి పనిచేస్తున్న ఈ సంస్థల ట్వీట్లతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ట్విటర్‌ను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
రైతు నిరసనలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ట్విటర్‌ ఇంకా ఈ ఉత్తర్వులపై స్పందించలేదని, ఫిబ్రవరి 4న ఈ జాబితాను కంపెనీకి అందించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. 
 
ట్విటర్‌ సిఇఒ జాక్‌డోర్సే నిరసనకు మద్దతు ఇచ్చిన కొన్ని ట్వీట్లకు మద్దతు తెలపడంతో .. ఖాతాలను తొలగించకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తటస్థ వైఖరిపై ట్విటర్‌ ప్రభుత్వం నుండి విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ట్రాక్టర్‌ ర్యాలీలో తలెత్తిన హింసాకాండ నేపథ్యంలో.. కేంద్రం గతంలో రైతులకు సంబంధించి గతంలో 250 ఖాతాలను తొలగించాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఖాతాలను పునరుద్ధరించే అంశంపై ట్విటర్‌కు, కేంద్రానికి మధ్య ఘర్షనలు కొనసాగుతున్నాయి.