సంపూర్ణ మద్యనిషేధం దిశగా మధ్య ప్రదేశ్ 

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం మద్య నిషేధం విధించేందుకు ఆలోచిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. అయితే రాష్ట్రాన్ని మంచిగా తీర్చిదిద్దేందుకు మద్య నిషేధంతో మాత్రమే సాధ్యం కాదని స్పష్టం చేశారు. తాగే వ్యక్తులుంటే సరఫరా చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. 

ప్రజలు మద్యం సేవించకుండా ప్రచారాన్ని నిర్వహిస్తామని, మంచి రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు. ఈ మేరకు తీర్మానం తీసుకురావాల్సి ఉందని చెప్పారు. శనివారం కట్ని జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాగా, గత నెలలో కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్య నిషేధం విధించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కోరారు. మధ్యప్రదేశ్‌లో కొత్తగా మద్యం దుకాణాలు ప్రారంభిస్తామంటూ ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా ప్రకటించిన సమయంలో ఉమాభారతి స్పందించారు. 

కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ విధించిన సమయంలో అన్ని రాష్ట్రాల్లో మద్యం నిషేధం పాటించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. కరోనా, ఇతర అనారోగ్య కారణాలతో మరణాలు జరిగాయే తప్ప.. మద్యపానంతో ఒక్క మరణం సంభవించలేదని గుర్తు చేశారు. 

యూపీ, మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి మరణించిన ఉదంతాలనూ   ప్రస్తావించారు. రోడ్డు ప్రమాదాలకు మద్యపానం సైతం ఓ ప్రధాన కారణమని పేర్కొన్నారు. మద్యం మత్తులో జరుగుతున్న భయంకరమైన దారుణాలు, హత్యలు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు దేశానికి మచ్చను తెస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

శాంతిభద్రతలను కాపాడేందుకు వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నారని, సమాజంలో సమతుల్యతను నిలుపుకునేందుకు మద్యనిషేధం కీలకమైన చర్య అని పేర్కొన్నారు.