కరోనాకు గురైన 21 శాతం జనాభా 

జనాభాలో 18 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయస్సున్న 21.4 శాతం 28,569 మంది గతం లోనే కరోనా వైరస్ ప్రభావానికి గురై ఉండవచ్చని చెప్పడానికి సాక్షాలు ఉన్నాయని జాతీయ సీరో సర్వేలో బయటపడింది. ఐసిఎంఆర్ ఆధ్వర్యంలో మూడో జాతీయ సీరో సర్వే గత ఏడాది డిసెంబర్ 7 నుంచి ఈ ఏడాది జనవరి 8 వరకు జరిగింది.  ఈ వివరాలు ప్రభుత్వ వెల్లడిస్తూ జనాభాలో ఎక్కువ శాతం మంది ఇంకా వైరస్‌కు బాధితులౌతున్నారని వివరించింది. 

ఈ సందర్భంగా ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ సర్వేలోని వివరాలు తెలియచేస్తూ 10 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లల్లో 25.3 శాతం మందికి కూడా కరోనా వైరస్ గతంలో సోకినట్టు తేలిందని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల కన్నా అర్బన్ మురికి వాడల్లోను, ఇతర ప్రాంతాల్లోను సార్స్ కొవి2 అత్యధికంగా వ్యాపించిందని, గ్రామీణ ప్రాం తాల్లో ఈ వైరస్ వ్యాప్తి 19.1 శాతం ఉండగా, అర్బన్ మురికి వాడల్లో 31.7 శాతం, అర్బన్ ఇతరప్రాంతాల్లో 26.2శాతం వరకు వైరస్ వ్యాపించిందని భార్గవ చెప్పారు. 60 ఏళ్లు పైబడిన 23.4 శాతం వృద్ధులు కొవిడ్19 బాధితులయ్యారని తెలిపారు. 

అదే సమయంలో 7,171 మంది హెల్త్‌కేర్ వర్కర్ల రక్తనమూనాలు సేకరించడమైందని, వీరిలో 25.7 శాతం వరకు వైరస్ వ్యాపించిందని తేలినట్టు తెలిపారు. రెండుసార్లు నిర్వహించిన ఈ సర్వేకు 21 రాష్ట్రాలకు చెందిన 70 జిల్లాల్లో 700 గ్రామాలు లేదా వార్డులను ఎంపిక చేశారు. 

దేశం లోని కరోనా వైరస్ పరిస్థితిని వివరిస్తూ కరోనా పాజిటివ్ రేటు 5.42 శాతం వరకు ఉన్నా , తరువాత క్షీణించిందని, వారాల వారీగా పాజిటివ్ రేటు 1.82 శాతం వరకు నమోదైందని వెల్లడించారు. 47 జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులేవీ నమోదు కాలేదు. అలాగే 251 జిల్లాల్లో గత మూడు వారాలుగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.