ఇక డ్రైవింగ్‌ టెస్ట్‌ లేకుండా లైసెన్స్‌  

I

ఇక డ్రైవింగ్‌ టెస్ట్‌ లేకుండా లైసెన్స్‌లు జారీ చేసే ప్రక్రియ ఊపందుకోనుంది. ఈ మేరకు డ్రైవర్‌ శిక్షణా కేంద్రాలకు అక్రిడిటేషన్‌ కోసం రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

పౌరులకు డ్రైవింగ్‌లో నాణ్యతతో కూడిన శిక్షణను అందించేలా ఈ కేంద్రాలకు నిర్ధిష్టమైన అర్హతలు ఉండేలా ముసాయిదాను రూపొందించింది. ఈ కేంద్రాల్లో డ్రైవర్‌ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ కోసం డ్రైవింగ్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు లభిస్తుందని ఈ నోటిఫికేషన్‌లో మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇది రవాణా పరిశ్రమకు సుశిక్షితులైన డ్రైవర్లను అందించేందుకు ఉపకరిస్తుందని, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ముసాయిదా నోటిఫికేషన్‌ను మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది.

2025 నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి సగం తగ్గించాలనే ధ్యేయంతో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదాను ముందుకుతెచ్చింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల జాతీయ రోడ్డు భద్రతా మండలి సమావేశంలో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. దీనికి మనమంతా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.