ప్రభాస్‌ ‘ఆదిపురుష్’‌ షూటింగ్‌లో అగ్నిప్రమాదం  

 ‘ఆదిపురుష్’‌ సినిమా షూటింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముంబైలోని ఓ స్టూడియోలో షూటింగ్‌ సమయంలో ప్రమాదం జరగ్గా గ్రీన్‌ స్క్రీన్‌ సెట్టింగ్‌ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ముహూర్తపు షాట్‌ రోజునే సెట్‌లో మంటలు చెలరేగాయి. 

‘ఆదిపురుష్’ షూటింగ్ పూజా కార్యక్రమాలతో మంగ‌ళ‌వారం లాంఛనంగా  మొదలైంది. అలాగే ముంబైలోని గోరెగాన్ స్టూడియోలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది.  ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.  గ్రీన్ స్క్రీన్ క్రోమా సెట్‌ పూర్తిగా కాలిపోవడంతో పాటు భారీగానే ఆస్తి నష్టం కూడా జరిగిందని తెలుస్తున్న‌ది.

అయితే సమయానికి అక్కడెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. దాంతో యూనిట్ అంతా ఊపిరిపీల్చుకున్నారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో 3డీలో ఆదిపురుష్ మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. మరోవైపు దర్శకుడు ఓం రౌత్ బృందం కూడా సురక్షితంగా ఉన్నారు.