నైట్ విజన్ గాగుల్స్‌తో వాయుసేన అరుదైన ఫీట్

భారత వాయుసేన (ఐఎఎఫ్) మరో అరుదైన ఫీట్ సాధించింది. నైట్ విజన్ గాగుల్స్ సాయంతో తూర్పు సెక్టార్‌లో రవాణా విమానాన్ని  వియవంతంగా ల్యాండ్ చేసింది. సి330 అధునాతన లాండింగ్ గ్రౌండ్‌లో దిగిందని వాయుసే ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీనికి సంబంధించిన రెండు వీడియో క్లిప్‌లను షేర్ చేసింది. హార్‌కామ్ దేశ్ కే నామ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది.

ఈ ఎన్‌వీజీ సాంకేతికత సాయంతో తక్కువ వెలుగులో ఐఎఎఫ్ మరింత సమర్ధతతో ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుపడుతుంది. ఒక క్లిప్‌లో ఎన్‌వీజీ సాయంతో విమానం సజావుగా ల్యాండ్ కావడం కనిపించింది. ఎయిర్‌క్రాఫ్ట్ లోపలి నుంచి వ్యూ ఎలా ఉంటుందో మరో వీడియోలో పంచుకుంది. 

“దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునే ప్రక్రియలో భాగంగా మా సామర్థాలను పెంపొందించుకొనేందుకు కట్టుబడి ఉన్నాం” అని ఈ సందర్భంగా ఐఎఎఫ్ తెలిపింది. అవి ఎన్‌వీజీ విజువల్స్ కావడంతో ఆ దృశ్యాలన్నీ ఆకుపచ్చ రంగులో భిన్నంగా కనిపిస్తున్నాయి. 

ఒడిశా, ఝార్ఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు తూర్పు సెక్టార్ పరిధి లోకి వస్తాయి. చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్‌తో కూడిన 6300 కిమీ అంతర్జాతీయ సరిహద్దుకు బాధ్యత వహిస్తుంది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వేళ, ఈ సెక్టార్‌లో సైన్యం బలోపేతంపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారించింది. దానిలో భాగంగా ఈ సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది. 

ఇదివరకు నియంత్రణ రేఖ వద్ద కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్ మీద కూడా ఈ విమానం రాత్రివేళ విజయవంతంగా ల్యాండ్ అయింది. తక్కువ స్థలంలోనే ల్యాండింగ్, టేకాఫ్ కావడం సి130 జె ప్రత్యేకత .