బీజేపీ, జనసేన కూటమికి చిరంజీవి మద్దతు 

2024లో బీజేపీ, జనసేన కూటమికి నటుడు చిరంజీవి మద్దతిస్తారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  ప్రకటించారు. ఏపీలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమకు ఇంకా ఎవరెవరు మద్దతిస్తారో చూస్తారని చెప్పారు. ఏపీలో బీజేపీ, జనసేన బలపడుతున్నాయని తెలిపారు. తాము అధికారంలోకి రావాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారని సోమువీర్రాజు చెప్పారు.

జనసేన పార్టీలో చిరంజీవి కూడా భాగమేన‌ని  ఆ పార్టీ  కీల‌క‌నేత‌  నాదెండ్ల మనోహర్ ప్రకటించిన మరుసటి రోజునే వీర్రాజు ఈ వాఖ్యలు చేయడం గమనార్హం. జనసేనకు రాజకీయంగా సహకారం అందించడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

‘‘చిరంజీవితో పవన్‌ కల్యాణ్‌, నేను కొద్దిరోజుల క్రితం సమావేశమయ్యాం. ఆ సమయంలో మళ్లీ సినిమాల్లో నటించాలని పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి సూచించారు. అలాగే, పవన్‌ కల్యాణ్‌ఖు రాజకీయంగా అండదండలు అందజేస్తానని భరోసా ఇచ్చారు’’ అని తెలిపారు. 

నిన్న మనోహర్ చేసిన వ్యాఖ్యలు  ఇప్పుడు వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో చిరంజీవి జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో తిరుపతి నుంచి చిరంజీవి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తమ్ముడు పవన్‌కి చిరంజీవి తోడుగా ఉంటారని.. జనసేన, బీజేపీ గెలుపునకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.