భారత్ కు చేరిన మరో మూడు రఫెల్ యుద్ధ విమానాలు 

మరో మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు బుధవారం చేరుకున్నాయి. యూఏఈ ఎంఆర్టీటీ ద్వారా  గాలిలోనే     ఇంధనం   నింపుకున్న ఈ జెట్స్‌ ఏకధాటిగా 7 వేల కిలోమీటర్ల దూరంపైగా    ప్రయాణించి  గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఎయిర్‌ బేస్‌లో ల్యాండ్‌ అయ్యాయి.

అత్యాధునిక యుద్ధ విమానాలైన 36 రాఫెల్స్‌ను రూ.59 వేల కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు 2016లో ఫ్రాన్స్‌తో భారత్‌ ఒప్పందం చేసుకున్నది. గత ఏడాది జూలై 29న తొలి బ్యాచ్‌గా ఐదు రాఫెల్స్‌ పంజాబ్‌లోని అంబాలా ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నాయి.

 రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వాటిని లాంఛనంగా భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. గత ఏడాది నవంబర్‌లో రెండో బ్యాచ్‌ కింద మూడు రాఫెల్స్‌ జామ్‌నగర్‌ ఎయిర్‌ బేస్‌కు చేరాయి. తాజాగా మూడో బ్యాచ్‌ కింద మరో మూడు రాఫెల్స్‌ బుధవారం రాత్రికి జామ్‌నగర్‌ ఎయిర్‌ బేస్‌లో ల్యాండ్‌ అయ్యాయి. వీటి రాకతో ఐఏఎఫ్‌లో రాఫెల్స్‌ సంఖ్య 11కు చేరింది.