ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంకు పద్శవిభూషణ్  

దేశ 72వ గణతంత్ర దినోత్సవ తరుణంలో వివిధ రంగాలలో విశిష్టతలు కనబర్చి, ఎనలేని సేవలు అందించిన వారికి పద్మ పురస్కారాలు వెలువడ్డాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ప్రకటించిన ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలలో గానగంధర్వుడు దివంగత ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యానికి పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించారు.

తన గానంతో ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుని చిరస్థాయి ఖ్యాతిని దక్కించుకున్న ఈ తెలుగు గాయకుడికి పద్మ పురస్కారాల జాబితాలో విశిష్ట స్థానం లభించింది. బాలు మరణానంతరం దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్‌ అయ్యారు. కళలు సంస్కృతి విభాగంలో వివిధ భాషల్లో దాదాపు 40వేల పాటలు ఆలపించిన సంగీతకారుడు ఎస్‌పికి ఈ పురస్కారం వచ్చింది.

విద్య, వైద్యం, సాహిత్యం, కళలు, సామాజిక సేవ.. ఇలా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 120 మంది ప్రముఖులకు 119  పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 120 మందిలో ఏడుగురికి పద్మవిభూషణ్‌.. పది మందికి పద్మభూషణ్‌, 103 మందికి పద్మశ్రీ ప్రకటించింది. గుజరాత్‌కు చెందిన ఇద్దరు కళాకారులకు కలిపి ఒకటే పద్మశ్రీ పురస్కారం ప్రకటించినందున మొత్తం అవార్డులు 119 అయ్యాయి. 

కాగా, ఈ జాబితాలో మొత్తం 29 మంది మహిళలు కాగా.. 10 మంది విదేశీయులు/ప్రవాస భారతీయులు/భారత మూలాలున్న వ్యక్తులు/ఓవర్సీస్‌ సిటిజన్‌షి్‌ప ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కేటగిరీవారు. ఒకరు ట్రాన్స్‌జెండర్‌. బాలు, పాసవాన్‌ సహా 16 మందికి మరణానంతర పురస్కారాలు ప్రకటించారు.  

పద్మవిభూషణ్‌ పురస్కారాలు లభించిన వారిలో బాలుతోపాటు.. జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే, వైద్య రంగంలో సేవలందించిన బెల్లె మోనప్ప హెగ్డే, నరీందర్‌ సింగ్‌ కపనీ (మరణానంతరం), మౌలానా వహీదుద్దీన్‌ ఖాన్‌ (ఆధ్యాత్మికం), బీబీ లాల్‌ (ఆర్కియాలజీ), సుదర్శన్‌ సాహు (ఆర్ట్‌) ఉన్నారు. 

పద్మభూషణ్‌ లభించిన 10 మందిలో కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార, అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ (మరణానంతరం), కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ (మరణానంతరం), గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయి పటేల్‌ (మరణానంతరం), మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, ప్రధానమంత్రి కార్యాలయంలో గత ఏడాది వరకూ ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రా తదితరులు ఉన్నారు.   

తెలుగు పద్మాలు..

పద్మశ్రీ పురస్కారాలు లభించిన 103 మందిలో నలుగురు తెలుగువారున్నారు. వారిలో ఒకరు.. తెలంగాణకు చెందిన ప్రముఖ గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజు కాగా.. మిగతా ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వాయులీన విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతీ రామమోహనరావు, అనంతపురానికి చెందిన సాహితీవేత్త, విద్యావేత్త ఆశావాది ప్రకాశ్‌రావు.