రెచ్చిపోయిన చైనా.. దీటుగా జవాబిచ్చిన భారత్

చైనా మ‌రోసారి హ‌ద్దు మీర‌డానికి ప్ర‌య‌త్నించింది. ఆ దేశ సైనికులు భారత్ లోకి చొచ్చుకు రావ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా  అప్రమత్తంగా ఉన్న భార‌త జ‌వాన్లు స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ సిక్కింలోని నాకూ లాలో గ‌త వారం జ‌రిగింది.  
 
ఓ వైపు చర్చలు జరుగుతుండగానే సిక్కింలో భారత, చైనా దళాల మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగడం గమనార్హం. ఈ సందర్భంగా ఇరు దేశాల జవాన్లు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 20 మంది చైనా సైనికుల‌కు గాయాలయ్యాయని తెలుస్తోంది. నలుగురు భారత జవాన్‌లు కూడా దాడిలో గాయపడ్డారని సమాచారం.
 
సుమారు మూడ్రోజుల కింద ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం రాలేదు. అయితే ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని, పరిస్థితి మాత్రం పూర్తి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నా సరే… సరిహద్దుల్లో సమర్థవంతంగా సైనికులు తమ విధి నిర్వహణలో నిమగ్నమయ్యారని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. గతంలో గల్వాన్ లోయలో ఇరు దేశాల జవాన్‌‌ల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే.

కాగా తూర్పు లడాఖ్‌లో చైనా  దుశ్చర్య కారణంగా జూన్ 2020 లో, గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు మరణించడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఈ ప్రతిష్టంభను తొలగింపునకు సంబంధించి  భారత్‌, చైనా మధ్య ఈ రోజు  తొమ్మిదో రౌండ్‌ సైనిక చర్చలను నిర్వహించనున్నాయి.