అఖిలప్రియకు బెయిల్…. భర్తకు తిరస్కారం   

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. శుక్రవారం నాడు అఖిలప్రియకు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రూ. 10 వేల పూచీకత్తు ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. చంచల్ గూడ జైల్లో 17 రోజులుగా అఖిల ప్రియ రిమాండ్‌లో ఉంటున్న విషయం విదితమే.  శనివారం నాడు అఖిల జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు  ఉన్నాయి.
అఖిలకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఆమె భర్త భార్గవ్ రామ్‌కు మాత్రం సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. కాగా, ఈ కేసులో ఎ 3 గా భార్గవ్ రామ్‌ ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో ముందోస్తు బెయిల్ ఇవ్వరని పోలుసులు చెబుతున్నారు.
బోయినపల్లిలో ప్రవీణ్ సోదారులను కిడ్నాప్ చేసిన తరువాత భార్గవ్ రామ్ స్వయంగా కారు నడుపుతూ ప్రవీణ్ రావు, అతని సోదరులను ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లాడని, ఆయన్ను విచారిస్తే మరికొంత సమాచారం బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న భూమా అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో సోమవారం విచారణ జరగనుంది.