చైనా వెనుకడుగుతో టీకాలకై దిక్కుతోచని ఇమ్రాన్ ఖాన్

కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా దేశాలు టీకాలను సేకరించి,  తమ ప్రజలకు ఉపశమనం కల్గించే ప్రయత్నం చేస్తుండగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం దిక్కుతోచని పరిస్థితులలో చిక్కుకున్నారు. పలు పొరుగుదేశాలకు టీకాలను సరఫరా చేస్తున్న భారత్ ను అడగలేక,  మిత్రదేశం అనుకొంటున్న చైనా టీకాలు సరఫరా చేయకుండా మౌనం వహిస్తూ ఉండడంతో ఇరకాట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 
 
బాంగ్లాదేశ్ వలె టీకాల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకోక, సొంతంగా టీకాలు తయారు చేసుకునే సామర్థ్యం లేక పాక్ ప్రభుత్వం ఇక్కట్ల పాలవుతోంది.   టీకా సేకరణకు వేగవంతం చేయాలని టీకాల సేకరణకు ఏర్పాటు చేసిన క్యాబినెట్ కమిటీని ఆదేశించినా మార్గం కనబడటం లేదు.  
అంతకుమునుపే ఇమ్రాన్ ప్రభుత్వం..ఆక్స్‌ఫర్డ్ టీకాకు, చైనాకు చెందిన సైనోఫార్మ్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు జారీ చేసింది. గత ఏడాది చివర్లో కరోనా కారణంగా అత్యధిక ప్రమాదం ఎదుర్కొంటున్న 5 శాతం జనాభాకు టీకా వేసేందుకు 150 బిలియన్ డాలర్లను కేటాయించింది. కానీ ఇటువంటి నిర్ణయాలు ఎన్ని తీసుకున్నప్పటికీ జరగవలసిన ఆలస్యం జరిగిపోయింది.
బాంగ్లాదేశ్ అప్పటికే 30 మిలియన్ల టీకాల కోసం భారత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి అదనంగా భారత్ మరో 20 లక్షల టీకా డోసులను భారత్‌కు బహుమానాంగా ఇచ్చింది. మరోవైపు భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్, వంటి దేశాలు భారత్ సహాయాన్ని కోరడం మోదీ ప్రభుత్వం అందుకు అంగీకరించడం చెకచెకా జరిగిపోయాయి.
దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఇమ్రాన్ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థను ఆశ్రయించే యోచలో ఉన్నట్టు తెలుస్తోంది. డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలోని కోవాక్స్ కూటమి ద్వారా టీకాలు పొందేందుకు ప్రయత్నిస్తోంది. పేద దేశాలకు తక్కువ ధరకు టీకాలు అందించడమేన కోవాక్స్ కూటమి వెనుకున్న ప్రధాన ఉద్దేశ్యం.

ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ టీకా కోసం అధిక ధర చెల్లించాల్సి వస్తుంది. ఓక్కో డోసుకు 6 నుంచి 7 డాలర్లు చెల్లించాల్సి రావచ్చు. దీనికి సిద్ధపడ్డా కూడా ఇదే సమయానికి టీకాలు అందుతాయన్న స్పష్టమైన హామీ ఏదీ పాక్‌కు లభించలేదని తెలుస్తున్నది.