ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బైడెన్ తీవ్రంగా ఖండించారు. అగ్రరాజ్యంగా అమెరికా లేకపోతే మరి ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు. “ట్రంప్ కోరుకున్నట్లే అమెరికా ప్రపంచ వేదికపై నుంచి తప్పుకుంటే ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తారు?” అని ఆయన ప్రశ్నించారు.
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్లోరిడాలో మాట్లాడిన జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలోని టంపాలోని హిల్స్బరో కమ్యూనిటీ కాలేజీలో మంగళవారం జరిగిన ప్రచార కార్యక్రమంలో అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తన గెలుపును కోరుకుంటున్నాయని చెప్పారు. జీ7, జీ20 వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాధినేతలు మీరే గెలవాలని తనతో చెప్పారని పేర్కొన్నారు.
యావత్ ప్రపంచం అమెరికావైపే చూస్తోందని తెలిపారు. ఎవరు గెలుస్తారనే అంశం కంటే, ఈ ఎన్నికలు ఎలా జరగనున్నాయనే దానిపైనే అందరూ దృష్టి సారించారని బైడెన్ చెప్పుకొచ్చారు. కీలకమైన అధ్యక్ష ఎన్నికలకు ముందు బైడెన్ 2020లో తాను గెలిచిన రాష్ట్రాల్లోనే కాకుండా ట్రంప్ చేతిలో తాను ఓడిపోయిన రాష్ట్రాల్లో కూడా గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. 2020లో ట్రంప్ ఫ్లోరిడాలో బైడెన్ను కేవలం 3.3 శాతం పాయింట్లతో ఓడించడం జరిగింది.
ఇక ఇప్పటి వరకు తమకు 500 మిలియన్ల డాలర్లకు పైగా విరాళాలు అందాయని బైడెన్ తెలిపారు. వీటిని 16 లక్షల మంది దాతలు ఇచ్చినట్లు వెల్లడించారు. వీరిలో 97 శాతం మంది 200 డాలర్ల కంటే తక్కువ ఇచ్చారని బైడెన్ చెప్పారు. ఇక అనేక సర్వేల్లో డొనాల్డ్ ట్రంప్ కంటే తానే ముందున్నానని జో బైడెన్ తెలిపారు.
“ఇప్పటివరకు వెలువడిన 23 జాతీయ స్థాయి పోల్స్లో పదింటిలో నేనే ముందున్నాను. డొనాల్డ్ ట్రంప్ ఎనిమిదింటిలో ఆధిక్యంలో ఉన్నారు. ఐదింటిలో టై అయ్యింది. కచ్చితంగా పరిస్థితులు మనకే అనుకూలంగా ఉన్నాయి” అని బైడెన్ తన మద్దతుదారులకు వివరించడం జరిగింది.
More Stories
రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం.. రాజధానిగా అమరావతి చేస్తాం
పోలింగ్కు ముందే జారిపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు
పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది