ఓ సమైక్య దేశంగా అమెరికా అడుగెయ్యాలి  

“అమెరికా కథ నాదో, ఏ ఒక్కరిదో లేక ఏ కొద్దిమందిదో కాదు, అందరిదీ. ఓ సమైక్య దేశంగా అడుగెయ్యాలి” అంటూ  దేశ 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేస్తూ పిలుపిచ్చారు.  సవాళ్లను సమైక్యంగా ఎదుర్కొందామని పిలుపిస్తూ తొలి ప్రసంగం చేస్తూ ‘‘ఈరోజు అమెరికాది. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. చరిత్రాత్మకమైన రోజు. ఆశావహమైన రోజుల కోసం సంకల్పం తీసుకోవాల్సిన రోజు” అంటూ పేర్కొన్నారు. 
 
తన విజయం ప్రజా విజయం అంటూ పేర్కొంటూ ప్రజాస్వామ్యం విలువైనదని, అదే సమయంలో బలహీనమైనది కూడా అని హెచ్చరించారు. కానీ ఆ ప్రజాస్వామ్యమే నేడు గెలుపొందిందని సంతోషం వ్యక్తం చేశారు. “ఈ రోజు ఓ అభ్యర్థి గెలవలేదు.. ప్రజాస్వామ్యమే విజయం సాధించిందని మనం చూశాం” అని తెలిపారు. 
 
కొద్ది రోజుల కిందటే ఇక్కడే కేపిటల్‌ భవన పునాదులను పెకలించే హింస ప్రబలిందని గుర్తు చేస్తూ “కానీ దేశమంతా ఒక్కటై నిలిచింది. దేవుడి దయ వల్ల అవిచ్ఛిన్నంగా నిలదొక్కుకుంది. అధికార మార్పిడి సజావుగా జరిగింది” అంటూ తెలిపారు. ఇంకా, అలసిపోకుండా, ధైర్యంగా, ఆశావహంగా ఇక దేశంపై దృష్టిపెట్టాలని కోరారు.
ఆగ్రహం, అసంతృప్తి, ద్వేషం, అరాచకం, తీవ్రవాదం, హింస, నిరాశా నిస్పృహలు, నిరుద్యోగం … ఇవన్నీ మన ఉమ్మడి శత్రువులని ప్రకటించారు. వీటికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం రండి అని పిలుపిస్తూ సమైక్యంగా ఉంటే ఎంతో సాధించవచ్చని చెప్పారు.  ఎన్నో తప్పుల్ని సరిదిద్దవచ్చని, మరెన్నో మంచిపనులు చేయవచ్చని,  వైర్‌సను తుదముట్టించవచ్చని అంటూ అమెరికాను ప్రపంచ క్షేమం కోరే శక్తిగా మళ్లీ తీర్చిదిద్దవచ్చని చెప్పుకొచ్చారు.
“సమైక్యత అన్నది ఓ భ్రాంతిగా, ఫాంటసీగా చాలా మందికి తోచవచ్చు. కానీ ఇది మనకి కొత్త కాదు. ఎన్నోమార్లు చూశాం. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు పొంచే ఉన్నాయని మనకి తెలుసు. ఇది నిరంతర పోరాటం’’ అని బైడెన్‌ హెచ్చరించారు.
 
జాతి, వర్ణం, స్థానిక-స్థానికేతర అంతరాలతో విభజితమైన అమెరికా సమాజాన్ని ఐక్యం చేసి, స్వస్థత చేకూరుస్తామని బైడెన్‌ విస్పష్టంగా ప్రకటించారు. ఐకమత్యంతోనే సవాళ్లను అధిగమించగలమని స్పష్టంచేశారు. తనకు ఓటు వేసినా, వేయకపోయినా అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటానని చెప్పారు.  

‘‘మనం ఒకర్నొకరం ప్రత్యర్థులుగా కాకుండా, పొరుగువారిగా చూసుకుందాం. ఒకర్నొకరం గౌరవించుకుంటూ హుందాగా మసలుదాం. విద్వేషాలొద్దు… ఐక్యత లేనిదే ప్రశాంతత లేదు. ఇది నిజం. దీన్ని సాధించిననాడు మనం విఫలం కాబోము. కలిసికట్టుగా ఉన్నన్నాళ్లూ ఎన్నడూ అమెరికా విఫలం కాలేదు” అంటూ సందేశం ఇచ్చారు. 

 “ఫలానాది సాధ్యం కాదనో, పరిస్థితులు మారవనో నాకు చెప్పొద్దు. ఓ మహిళ దేశ ఉపాద్యక్షురాలైంది. ఇది చరిత్ర’’ అని బైడెన్‌ ఉద్ఘాటించారు. ‘‘భవిష్యత్‌ గురించి చాలా మంది ప్రజల్లో బెంగ, భయాలు ఉన్నాయి. ఉద్యోగం ఉంటుందా,  పన్నులెలా కట్టాలి, కుటుంబాన్నెలా పోషించాలి… ఇలా! రేపేం జరుగుతుందోనన్న ఆందోళన అనేకమందిని వెన్నాడుతోంది. భయపడవద్దు.. మీలో మీరు కుమిలిపోకండి. పోటీపడండి. మిమ్మల్ని నమ్మని వారిని దూరం పెట్టండి’ అని ఆయన భరోసానిచ్చారు.

‘ఈ అనాగరిక, అమర్యాదపూర్వక యుద్ధానికి చరమగీతం పాడాలి. మన ఆత్మలను, హృదయాలను తెరిచి, సామరస్యానికి తావిస్తే ఇది సాధ్యమే. ఇతరుల కోణంలో నుంచి కూడా చూడాలి’ అని ఆయన హితవు పలికారు.  ‘‘ఈ ఆపత్సమయంలో ఒకరికొకరి సాయం కావాలి. శతాబ్దిలో ఒకసారి వచ్చే మహమ్మారిని ఎదుర్కొనడానికి కలిసిరండి. ప్రాణాంతకమైన ఈ శీతాకాలాన్ని మనం దాటేయాలి. రాజకీయాల్ని పక్కనపెట్టి దేశమంతా ఒకే తీరుగా కదలాలి’’ అని విజ్ఞప్తి చేశారు. 

‘‘విజృంభించిన మహమ్మారి, ప్రజాస్వామ్యంపై దాడి, పర్యావరణ సంక్షోభం, వర్ణవివక్ష, అసమానతలు… ఇవన్నీ విడివిడిగా కాదు, అన్ని సంక్షోభాలూ ఒక్కసారే వచ్చిపడ్డాయి.. ధైర్యంగా ఎదుర్కొందాం’’ అని ఆయన కోరారు.

బైడెన్‌ కంటే 20 నిమిషాల ముందు.. దేశ 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ (56) ప్రమాణస్వీకారం చేశారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా, తొలి ఆఫ్రికన్‌-ఆమెరికన్‌గా, దక్షిణాసియా మూలాలున్న వ్యక్తిగా, భారతీయ మూలాలున్న వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు  

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే బైడెన్‌ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 15 కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన సంతకాలు చేయనున్నట్టు శ్వేతసౌధ అధికారులు తెలిపారు. ట్రంప్‌ తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలను ఉపసంహరించనున్నట్టు చెప్పారు.

వలస విధానంపై సమగ్ర బిల్లును కాంగ్రెస్‌ ఆమోదానికి బైడెన్‌ తొలిరోజే పంపనున్నారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు ఇందులో ప్రతిపాదనలు చేశారు. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డులపై దేశాలవారీ కోటాను కూడా ఎత్తివేయనున్నారు. దీనితో వేలాది భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం చేకూరనున్నది.