నిజమైన ఫ్యాక్షనిస్ట్ ఎలా ఉంటారో ఇప్పడు చూస్తున్నా!

నిజమైన ఫ్యాక్షనిస్ట్ ఎలా ఉంటారో ఇప్పడు చూస్తున్నామని మాజీ, మంత్రి, బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ అండదండలతోనే రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం జరుగుతున్నదని ఆరోపిస్తూ విగ్రహాల ధ్వంసానికి కారకులు ఎవరో ప్రభుత్వం వారంలోగా చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
ప్రభుత్వానికి సమర్ధత ఉంటే అసలు దోషులు ఎవరో చెప్పాలని సవాల్ చేశారు. తప్పించుకునేందుకే బీజేపీ పార్టీపై నేపం వేస్తే  సరిపోదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాను చెబుతున్నానని గుర్తు చేస్తూ అందుకు నిదర్శనమే గృహ నిర్బంధాలు అని దుయ్యబట్టారు.
ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. దాడులు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం చెప్పలేని పరిస్థితి అని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదని ఆయన దుయ్యబట్టారు.
ఏపీలో పోలీసు వ్యవస్థ చాలా ఆదర్శనీయంగా ఉండేదని, కానీ వైసీపీ నేతలు  చెప్పినట్లు నడుచుకోవాలనటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ చేతకానితనానికి మంత్రులు దూషణలే నిదర్శనమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు, డబ్బులు పంచి మళ్లీ ఎన్నికల్లో గెలవొచ్చని భావిస్తున్నారని, అయితే ఇవేవీ వారి సొంత డబ్బులు కావని ఎద్దేవా చేశారు.