వైసిపి నేతగా వ్యవహరిస్తున్న డీజీపీ గౌతమ్ సవాంగ్  

రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల వెనుక బీజేపీ శ్రేణుల హస్తముందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అనడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ  వెంటనే ఆ ప్రకటన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ వైసీపీ నేతగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.   
 
డీజీపీతో పాటు మంత్రి వెలంపల్లి శ్రీనివాసురావు కూడా అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. గతంలో వెలంపల్లి  మాతో  ఉండి కూల్చివేతలపై ఉద్యమం చేయలేదా అని ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేసిన వారిని ఎందుకు శిక్షించడం లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. 
 
 ఆలయాలను పరిరక్షించలేకపోతే మంత్రి వెలంపల్లి శ్రీనివాసురావు, డీజీపీ వెంటనే రాజీనామా చెయ్యాలని వీర్రాజు డిమాండ్ చేశారు.   హిందువులంటే ప్రభుత్వానికి భయమా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. హిందూ ఆలయాలకు సంబంధించిన నిధులతో చర్చిలు, దర్గాలు కడుతూ, పాస్టర్లకు జీతాలు ఇవ్వడం లేదా అని నిలదీశారు. 
 
ఇద్దరు మంత్రులు తిరుపతిలో క్రిస్టియన్లకు శుభాకాంక్షలు చెప్పారు. హిందూవుల మనోభావాలను వైసీపీ నేతలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. చర్చిలు, దర్గాలు కడితే విద్వేషాలు లేనిది తాము గుడి కోసం పాదయాత్ర చేస్తే విద్వేషాలు వస్తాయా అని నిలదీశారు.