వాట్సప్‌ కొత్త నిబంధనలపై మండిపాటు  

వాట్సప్‌ యాప్‌ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారుల సమాచారానికి భద్రత లేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వినియోగదారులు కొత్త నిబంధనలకు అంగీకరిస్తూ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలంటూ వాట్సప్‌ గురువారం ప్రకటించింది. 
 
కొత్త నిబంధన ప్రకారం వాట్సప్‌ వాడుతున్న వినియోగదారుల వ్యక్తిగత డేటాను వాట్సప్‌ పేరేంట్‌ కంపెనీ అయిన ఫేస్‌బుక్‌ వాడుకుంటుంది. ఈ సమాచారాన్ని వాడుకొని ఈ కామర్స్‌ బిజినెస్‌ చేస్తుంది. ఒకవేళ కొత్త నిబంధనలకు అంగీకారం తెలపకుంటే వారికి వాట్సప్‌ సేవలు అందుబాటులో ఉండవని కూడా ప్రకటించింది.
 
 ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్‌కు రెండు వందల కోట్ల వినియోగదారులు ఉన్నారు. ఈ కొత్త నిబంధన బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌లలో మొదట అమలు చేస్తున్నారు. ఈ నిబంధన వ్యక్తిగత గోప్యతకు భంగం కల్గిస్తుందంటూ నెటిజన్లు, హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిబంధనలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చట్టబద్ధం కావని వారు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్‌ వినియోగదారుల అసోసియేషన్‌ ‘లా క్వాడ్రేచర్‌ డునెట్‌’ న్యాయవాది మాట్లాడుతూ మెసేజింగ్‌ సేవను వినియోగించుకోవాలనుకుంటే వినియోగదారుల డేటా ఉల్లంఘనకు అనుమతించాల్సి వస్తుందని పేర్కొన్నారు. 

 
ఈ మార్పులను తిరస్కరించాలంటే ఒక్కటే మార్గం వాట్సప్‌ను వినియోగించకుండా ఉండటమేనని తెలిపారు. ఒక వేళ యాప్‌ను అనుమతిస్తే చట్ట విరుద్ధంగా వినియోగదారుల డేటా చోరీకి అనుమతించినట్లేనని చెప్పారు. ఈ నిబంధనకు అనుమతి ఇవ్వకుంటే మెసేజ్‌ సర్వీసులు నిలిపివేయబడుతున్నాయని వాట్సప్‌ యూజర్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ నిబంధన వినియోగదారుల డేటాకు భద్రత కల్పించడం లేదు కాబట్టి వాట్సప్‌ను వదలి సిగల్‌ లాంటి యాప్‌లకు మరలడం ఉత్తమమని వినియోగదారులు అంటున్నారు. ఇప్పటికే చాలామంది వాట్సప్‌కు గుడ్‌బై చెప్పి సిగల్‌ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకుంటున్నారు. దీంతో తమ యాప్‌ డౌన్‌లోడ్లు వీపరీతంగా పెరిగిపోయానని మేసేజింగ్‌ యాప్‌ సిగల్‌ ట్వీట్‌ చేసింది. 
 
మరోవైపు ప్రపంచ కుబేరుడు, టెల్సా అధినేత ఎలెన్‌ మాస్క్‌ కూడా వాట్సప్‌ను వదిలేసి సిగల్‌ లాంటి యాప్‌లను వాడాలంటూ ట్వీట్‌ చేశారు. వాట్సప్‌ యాప్‌ సురక్షితంగా ఉండేదని, తక్షణం సందేశాన్ని చేరవేసేందుకు అనువుగా ఉండేదని గతంలో ప్రశంసలు దక్కాయి. అయితే ఫేస్‌బుక్‌ సొంతం చేసుకున్న అనంతరం దీనిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. 
 
యూరోపియన్‌ యూనియన్‌ రాజకీయ నేతలు బ్రెగ్జిట్‌ చర్చల సమయంలో ఈ యాప్‌ను వినియోగించారు. వాట్సప్‌ ద్వారా చర్యలు జరుపుతుండటంతో ‘వాట్సప్‌ దౌత్యం’ అని కూడా పేర్కొన్నారు. అయితే సమాచార భద్రతలో సమస్యలు తలెత్తాయంటూ యూరోపియన్‌ కమిషన్‌ అనంతరం తన ఉద్యోగులకు తెలిపింది. 
 
వాట్సప్‌ నుంచి సిగల్‌కు మార్చుకోవాల్సిందిగా ఆదేశించింది. గతేడాది మేలో పలు మంత్రిత్వ శాఖలు, సంస్థలను వాట్సప్‌ వినియోగించవద్దని జర్మనీ డేటా గోప్యతా కమిషనర్‌ ఉల్రిచ్‌ కెల్బర్‌ సూచించారు. సమాచార రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సంస్థలను కోరారు. ఇదే అంశంపై వాట్సప్‌ మాతృసంస్థ ఫేస్‌బుక్‌ బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌లతో ఘర్షణ పడుతోంది. 
 
పోటీ చట్టాలను ఉల్లంఘించడంతో పాటు సోషల్‌మీడియా మార్కెట్‌పై గుత్తాధిపత్యం చెలాయిస్తుందంటూ డిసెంబర్‌లో యుఎస్‌ ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌, 48 రాష్ట్రాలు ఫేస్‌బుక్‌పై పిటిషన్‌ వేశాయి. 
 
వాట్సప్‌ వివాదాస్పందగా స్వాధీనం చేసుకున్న అనంతరం ఇతర సేవల మధ్య ఖాతాలను అనుసంధానించే సంస్థ గురించి వినోయగదారులను తప్పుదారి పట్టించినందుకు బ్రిటన్‌ ఫేస్‌బుక్‌పై 110 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. కాగా, వాట్సప్‌ను ఫేస్‌బుక్‌ 2014లో కొనుగోలు చేసింది. రెండేళ్ల అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా సొంతం చేసుకుంది.