బాలకోట్ దాడుల్లో 300 మంది మృతి… పాక్ మాజీ దౌత్యవేత్త వెల్లడి 

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ఉగ్ర స్థావరాలున్న బాలకోట్‌పై భారత వాయు సేన జరిపిన వైమానిక దాడుల్లో పశ్చికబయలు తప్ప అక్కడ ఎవ్వరు మరణించలేదని ఇప్పటి వరకు పాకిస్థాన్ బుకాయిస్తూ వస్తున్నది. అయితే తాజాగా సుమారు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు ఆ దేశ మాజీ దౌత్యవేత్త ఆఘా హిలాలీ అంగీకరించారు.

పాకిస్థాన్‌ టీవీ చర్చా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే ఆయన ఆ దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు అంగీకరించారు. ‘భారతదేశం అంతర్జాతీయ సరిహద్దును దాటి దాడులు చేసింది. ఇందులో కనీసం 300 మంది చనిపోయినట్లు నివేదికలున్నాయి” అంటూ పేర్కొన్నారు.

అందుకు ప్రతీకారంగా, తమ లక్ష్యం వారి కంటే భిన్నమైనదని చెప్పుకొంటూ వచ్చారు. “మేము వారి హైకమాండ్‌ను లక్ష్యంగా చేసుకున్నాము. అది మా చట్టబద్ధమైన లక్ష్యం. ఎందుకంటే వారు పురుష సైనికులు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ను మేము అనాలోచితంగా అంగీకరించాం. ఈ పరిమిత చర్య వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇప్పుడు మేం చెబుతున్నది ఏమంటే.. వారు (భారత్‌) ఏమి చేసినా, మేము అంతే చేస్తాము తప్ప ఉధృతం చేయలేం’ అని ఆఘా హిలాలీ తెలపడం గమనార్హం.  \

మరోవైపు మెరుపుదాడుల సందర్భంగా మిగ్‌ విమానం కూలి పాక్‌ భూభాగంలో దిగిన భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను ఆ దేశం అప్పగించడంపై పాకిస్థాన్‌ ముస్లిం లీగ్-ఎన్ నాయకుడు అయాజ్ సాదిక్ 2020 అక్టోబర్‌లో ఆ దేశ జాతీయ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ఒక ముఖ్యమైన సమావేశంలో మాట్లాడుతూ వింగ్ కమాండర్ అభినందన్‌ను పాక్‌ విడుదల చేయకపోతే, ఆ రోజు రాత్రి 9 గంటలకు భారతదేశం పాకిస్థాన్‌పై దాడి చేస్తుందని చెప్పారని పేర్కొన్నారు.

భారత్‌ దాడికి సిద్ధమైందన్న విషయాన్ని షా చెప్పడంతో పాక్‌ ఆర్మీ చీఫ్‌ కమర్ జావేద్ బజ్వా కాళ్లు వణికిపోయాయని, అందుకే అభినందన్‌ను భారత్‌కు అప్పగించారని వెల్లడించాయిరు. కాగా, ఆఘా హిలాలీ తాజాగా చేసిన వ్యాఖ్యలు దీనిని సమర్థించేలా ఉన్నాయి.