మతం పేరుతో జరిగే క్రీడను అడ్డుకుంటాం  

మతం పేరుతో జరిగే క్రీడను అడ్డుకుంటామని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టం చేశారు. మత మార్పిడిల పేరుతో మహిళలతో ఆడుకుంటున్నారని, వీటికి అడ్డుకట్ట వేసేందుకే ‘లవ్ జిహాదీ’ చట్టం రూపొందించామని తెలిపారు.

మత మార్పిడులు నానాటికీ పెరగిపోతున్నాయని వీటిని తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. యూపీ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం లవ్ జిహాదీ చట్టం చేసింది. ఈ చట్టాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శివరాజ్ సింగ్ మాట్లాడుతూ ‘‘మహిళల జీవితాలతో ఆడుకునే వారిని వదిలిపెట్టం. అవసరమైతే వారికి జీవిత ఖైదు విధించడానికి అయినా వెనకాడం. అందుకే మత మార్పిడులను అడ్డుకోవడానికి ‘లవ్ జిహాదీ’ చట్టం తీసుకువచ్చాం” అని తెలిపారు.

ఇప్పటికే చాలా మంది మహిళల్ని రక్షించామని చెబుతూ మతం పేరుతో మహిళలను వహించే ప్రయత్నం చేస్తే లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

కాగా ఈ విషయమై న్యాయవాది విశాల్ థాకరే, సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ నేతృత్వంలోని సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ సుప్రీంను ఆశ్రయించారు. అయితే పెళ్లి పేరుతో మత మార్పిడులకు పాల్పడటంపై నిషేధం విధిస్తున్న చట్టాల అమలును నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది.

ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌ను, ఉత్తరాఖండ్ అమలు చేస్తున్న మత స్వేచ్ఛ చట్టం, 2018ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.