మెహబూబా ఇంటికోసం రూ.82 లక్షలు ఖర్చు   

పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి  మెహబూబా ముఫ్తీ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 జనవరి నుంచి జూన్ వరకూ 6 నెలల కాలంలో రూ.82 లక్షలు ఖర్చు చేశారు. శ్రీనగర్‌లోని గుప్కార్ రోడ్డులో ఉన్న తన అధికార నివాసానికి మార్పులు చేర్పులు చేసేందుకు ఈ మొత్తం ఆమె ఖర్చు చేశారు. 
 
ఈ ఖర్చు మొత్తం భారత ప్రభుత్వం భరించింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు ఆర్టీఐ ఈ సమాచారం ఇచ్చింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన యాక్టివిస్ట్ ఇనామ్-ఉన్-నబి సౌదాగర్ ఈ సమాచారాన్ని ఆర్‌టీఐ నుంచి కోరారు. 
 
దుప్పట్లు, ఫర్నిచర్, టీవీ, ఇతర వస్తువుల కోసం మెహబూబా ముఫ్తీ సుమారు రూ.82 లక్షల ఖర్చు చేసినట్టు ఆర్టీఐ వెల్లడించింది. ఆ సమాచారం ప్రకారం, 2018, మార్చి 28వ తేదీ ఒక్కరోజే కార్పెట్ల కొనుగోలుకు ఆమె రూ.28 లక్షలు ఖర్చుచేశారు. 
 
జూన్‌ నెలలో రూ.22 లక్షలు విలువ చేసే ఎల్‌ఈడీ టీవీ సహా ఇతర వస్తువుల కోసం రూ.25 లక్షలు ఖర్చు చేశారు. ఆ ఏడాది ఫిబ్రవరి 22న బెడ్‌షీట్ల కోసం రూ.11,62,000 ఖర్చు చేశారని ఆర్డీఐ వెల్లడించింది. 
 
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించేంత వరకూ ఎన్నికలకు దూరంగా ఉంటామని ఆమె ఇటీవల ప్రకటించారు. అయితే ఇటీవల విజయవంతంగా ముగిసిన జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల్లో పీడీపీ పోటీ చేసింది. 280 సీట్లలో కేవలం 27 సీట్లు మాత్రమే గెలుచుకుంది.