ఆలయాలపై దాడుల నిందితులను కాపాడుతున్న ప్రభుత్వం 

నేర పరిశోధనలో  ఆధునిక  సాంకేతికతను ఉపయోగించడంలో జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు మాత్రం రాష్ట్రంలో వరుసగా ఆలయాలపై జరుగుతున్న దాడులలో అసలు నిందితులను మాత్రం పట్టుకోలేక పోతున్నారు. అధికార పక్షం నుండి వస్తున్న రాజకీయ వత్తిడులే అందుకు కారణంగా కనిపిస్తున్నది.   అధికార పక్షంపై చెందిన వారి అండదండలతోనే ఈ దాడులు జరుగుతున్నట్లు భావించవలసి వస్తున్నది. 
 
భక్తులు, పూజార్లు, హిందూ సంఘాలు, సాధువులు, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా విగ్రహాల విధ్వంసం ఆగకపోవడానికి  పోలీసుల అసమర్థత కారణం కాదని, అధికార పక్షం అండదండలతోనే ఇటువంటి దాడులు జరుగుతూ ఉండడంతో వారు   ‘నిస్సహాయులు”గా మిగిలి పోతున్నారని అభిప్రాయం కలుగుతున్నది. 

శ్రీశైలం మఠంలో గుప్తనిధుల కోసం తవ్వకాలకు సంబంధించిన కేసులో పోలీసులు ఒక అన్యమతస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను అధికార పార్టీ నేతలకు బాగా కావాల్సిన వ్యక్తి! ‘‘శివలింగం పెకలించిన ఘటనలో అతను ఉంటే రాజీనామా చేస్తా’’ అని స్థానిక వైసిపి ఎమ్యెల్యే  సవాల్‌ చేయగానే . పోలీసులు కేసు నుంచి ఆ వ్యక్తిని తప్పించారు. 

దీంతో శివాలయంలో తవ్వకాలు జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఆ అన్యమత నేత వీడియోను బీజేపీ నేతలు బహిర్గతం చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. పైగా వీడియో విడుదల చేసిన బీజేపీ నేతనే పోలీసులు బెదిరించారు. 

కర్నూలు జిల్లాలోనే ఇటీవల కోసిగా సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయ గోపురంపైన ఉన్న విగ్రహాల పెచ్చులూడి కిందపడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాన్ని కొట్టేశారని, హుండీ కూడా చోరీ చేసే ప్రయత్నం జరిగిందని స్వయంగా పూజారే తెలిపారు. అయితే పోలీసులు నిందితులను పట్టుకొనే ప్రయత్నం చేయకుండా  పూజారిని, ఆలయ ధర్మకర్తతోపాటు ఈ విషయాన్ని వాట్స్‌పలో షేర్‌ చేసిన విలేఖరులను అర్ధరాత్రి దాకా నిర్బంధించి, ఆ తర్వాత వాళ్లపై కేసు పెట్టారు. స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశంతోనే పోలీసులు ఈ విధంగా చేసారని తెలుస్తున్నది.

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చెందిన వెండి ఉత్సవ రథానికి ఉన్న మూడు వెండి సింహాలు మాయమయ్యాయి.  విషయం బయటికి రాగానే ‘లాక్‌డౌన్‌కు ముందే, తెలుగుదేశం హయాంలోనే విగ్రహాలు పోయాయ్‌’ అని అధికార పార్టీ నేతలు తేల్చేశారు. ఆ తర్వాత  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వెండి రథానికి సింహాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి.

రామతీర్థం ఘటనలో ‘తీవ్రంగా స్పందించిన’ ప్రభుత్వం ఆలయ ధర్మకర్త పదవి నుంచి టీడీపీ   సీనియర్‌ నేత అశోక్ గజపతి రాజును అప్పటికప్పుడు తప్పించిన రాష్ట్ర ప్రభుత్వం దుర్గమ్మ వెండి రథాల చోరీపై ఇలాంటి చర్యలేవీ తీసుకోలేదు.

గతంలో ఇదే విజయవాడలో కిలోల కొద్ది బంగారం పోయినప్పుడు, 8 రాష్ట్రాల్లోని దొంగలను ఇట్టే పట్టేశారు. ఇప్పుడు దుర్గమ్మ ఆలయ రథ వెండి సింహాల చోరీ కేసులో దర్యాప్తు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు.నెల్లూరులో రంగనాథ స్వామి ఆలయంలో  కూడా రథం తగలబడినప్పుడు… ‘ఎవరో పిచ్చోడు చేశాడు’ అని తేల్చేశారు. అసలైన బాధ్యుడిని మాత్రం గుర్తించలేక పోయారు.

రాష్ట్రంలో ఆలయాలు, ప్రార్థనా స్థలాల రక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసు ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నా విధ్వంసాలు మాత్రం ఆగడంలేదు. ‘ఇది ప్రతిపక్షం కుట్ర’ అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ… పోలీసులు ఇప్పటిదాకా ఒక్కరినీ ఆధారాలతో అరెస్టు చేయలేదు. 

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పెకలించి తీసేశారు. మరుసటి ఉదయం పూజారి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దామోదర్‌ రెడ్డి, నాగరాజు అనే ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.  అయితే నిందితుల్లో ఒకరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. సాదాసీదా కేసు పెట్టడంతో అతను ఇలా జైలుకు వెళ్లి అలా బెయిలుపై వచ్చేశాడు. నెలలు గడుస్తున్నా విగ్రహ పునః ప్రతిష్ట మాత్రం ఇప్పటికీ జరగలేదు.

అంతర్వేది నృసింహ స్వామి ఆలయ రథం తగలబడిన ఘటన సంచలనం సృష్టించింది.   ప్రభుత్వ పెద్దల వాదన ప్రకారం, అర్ధరాత్రి జరిగిన ఘటన కావడంతో పోలీసులు అసలు కారణమేమిటో కనుక్కోలేకపోయారు. రథం దగ్ధంపై భారీ ఆందోళనలు జరిగాయి.

నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ఒక చర్చికి చెందిన కిటికీల అద్దాలు పగిలాయి. ఇది పగటిపూట జరగడంతో నిందితులను చకచకా గుర్తించారు. 40మందిని అరెస్టు  చేసి, ఏడెనిమిది సెక్షన్ల కింద కేసు పెట్టి రిమాండుకు పంపించారు. 14రోజుల తర్వాతే వీరికి బెయిలు వచ్చింది. అంతర్వేది ఆలయ రథం సంగతేంటని ప్రశ్నిస్తే నెపం తేనెటీగలపైకి నెట్టి, ఆ తర్వాత కేసు దర్యాప్తు కేంద్ర సంస్థకు అప్పగించి ఊపిరి పీల్చుకున్నారు.