విజయవాడలో సీతమ్మ విగ్రహాల ధ్వంసం  

హిందూ ధర్మానికి ప్రతీకగా విగ్రహాలు నిలుస్తాయి. భగవంతుడిని విగ్రహ రూపంలో పూజిస్తుంటారు. సాక్షాత్తు దైవంగా భావిస్తూ సేవలు చేస్తుంటారు. అలాంటి విగ్రహాలపై ఏపీలో వరుస దాడులు జరుగుతున్నాయి. విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేస్తున్నారు. రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం శిరచ్ఛేదానికి గురవ్వడంతో ఈ దారుణాలు పరాకాష్టకు చేరాయి. గత నెల 28న విజయనగరం జిల్లా రామతీర్థంలో నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై యావత్ ఆంధ్రప్రదేశ్ భగ్గుమంది.

రామయ్య విగ్రహం ధ్వంసంపై భక్తులు, హిందూసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆ ఘటన మర్చిపోకముందే విజయవాడలో  సీతారామ ఆలయంలోని సీతమ్మ విగ్రహం ధ్వంసమైంది. నగరంలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఉన్న శ్రీ సీతారామ మందిరంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.

సీతాదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తాళం వేసి ఉన్న మందిరంలో విగ్రహాలను దుండగులు కొబ్బరి పిందెతో కొట్టారు. ఆదివారం ఉయదం గమనించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీతాదేవి విగ్రహ ధ్వంసం వివాదంపై  ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామనడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు డీసీపీ విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు. 

మందిరంలోకి ఎలుక దూరిందనే అంశాన్ని కూడా దర్యాప్తు చేస్తామని, సీతారామాలయానికి రాత్రి వేసిన తాళం అలాగే ఉందని తెలిపారు. ఉదయం కల్లా లోపల సీతమ్మ వారి విగ్రహం ముందుకు పడి ధ్వంసమై ఉందని, ఎవరైనా ధ్వంసం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. విగ్రహం ధ్వంసం చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని విక్రాంత్ పాటిల్ తెలిపారు.

ఇలా ఉండగా, కర్నూలు జిల్లాలో  కలకలం చెలరేగింది. కోసిగికి 4కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్లబండ ఆంజనేయస్వామి ఆలయ గోపురంపై ఉన్న సీతారాముల విగ్రహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటి శిథిలాలు కింద ఊడిపడ్డాయి. మూడు రోజుల కిందటే ఆలయ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 

శనివారం అర్చకుడు శ్రీరాములు ఆలయానికి వెళ్లి చూడగా… గోపురంపై విగ్రహాలు ధ్వంసమై కనిపించాయి. రథం స్వల్పంగా దెబ్బతిందని, ఆలయం లోపల హుండీని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారని ఆయన గ్రామపెద్దలకు, ధర్మకర్తలకు తెలిపారు. విగ్రహాలను పగలగొట్టారని మీడియా ప్రతినిధులకు అర్చకుడు స్వయంగా తెలిపారు.

ఇదే విషయం టీవీ చానళ్లలో ప్రసారమైంది. ఆ వెంటనే పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న విగ్రహాలను పూజారితోనే సరిచేయించి మళ్లీ రంగులు వేయించారు. కోసిగి సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ ధనుంజయ పోలీసు స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి. ఆలయంలో విగ్రహాల ధ్వంసం జరగలేదని తెలిపారు.

బిజెపి 5న చలో రామతీర్ధం 
మరోవంక, ఈ నెల 5న ఛలో రామతీర్థం చేపడుతామని బీజేపీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్  మాధవ్‌ ప్రకటించారు. రామతీర్థం కొండపైకి వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా వెళ్లారని విమర్శించారు. రామతీర్థం కొండపైకి బీజేపీ నేతలను అనుమతించ లేదని తప్పుబట్టారు. 
 
పోలీసులు దమనకాండ చేశారని, రాక్షస క్రీడకు పోలీసులే అవకాశం ఇచ్చారని ఆరోపించారు. దుండగులను పట్టుకునే వరకు దీక్ష కొనసాగిస్తామని మాధవ్‌ స్పష్టం చేశారు. గత నెల 28న విజయనగరం జిల్లా రామతీర్థంలో నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.