ప్రమాణస్వీకారానికి ముందే బీజేపీ కార్పొరేటర్ మృతి 

లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్‌గౌడ్ కన్నుమూశారు. అనారోగ్యంతో రమేష్‌గౌడ్ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఇంకా కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేయకముందే మృతిచెందడంతో బీజేపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
రమేష్‌గౌడ్ మృతి వార్త తెలుసుకున్న బీజేపీ నేతలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన మూడు రోజులకే  ఆకుల రమేష్ గౌడ్ కరోనాతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
2001-2006 వరకు ఎల్బీ నగర్ మున్సిపల్ ఛైర్మన్‌గా రమేష్‌గౌడ్ వ్యవహరించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్‌గా విజయ సాధించారు.

ఆకుల రమేశ్ గౌడ్ అకాల మరణం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూంర్ తీవ్ర దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే వారు తనువు చాలించడం అత్యంత దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.  నిత్యం ప్రజల్లో ఉంటూ, పేదల సంక్షేమం కోసం పాటు పడే రమేష్. .పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో విశేష కృషి చేసేవారని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన నికార్సయిన బీజేపీ కార్యకర్త రమేష్ అని పేర్కొన్నారు.