విగ్రహాల ధ్వంసంపై చివరకు జగన్ హెచ్చరిక 

ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న దేవాలయాలపై దాడులు, విగ్రవా ధ్వంసములపై చిట్ట చివరకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  తీవ్రంగా స్పందించారు. విగ్రహాల విధ్వంసం వంటి ఘటనలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. దేవుడితో చెలగాటమాడితే తప్పకుండా శిక్షిస్తాడని వరాయించారు. 

 మరోసారి ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా చర్యల చేపట్టాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.  ఇదిలా ఉంటే, అర్హత ఉండి ఇంటి పట్టా రాలేదనే మాట వినిపించకూడదని హెచ్చరించారు. అనర్హత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు.  సీఎంవో అధికారుల భేటీలో సీఎం జగన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.  

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై శతాబ్దాల నాటి రామాలయంలో రెండు రోజుల కిందట శ్రీరాముని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. శ్రీరాముడి విగ్రహం ధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భక్తులు, రాజకీయ నేతలు మండిపడ్డారు. 

టీడీపీ నేతలు కొండమెట్ల నుంచి దేవస్థానం వరకు మౌన ప్రదర్శన చేపట్టారు. బీజేపీ నాయకులు రెండు రోజులుగా బోడికొండపై దీక్షలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఘటనపై శాఖాపరమైన విచారణకు దేవదాయశాఖ ఆర్‌జేసీ స్థాయి అధికారి డి.భ్రమరాంబను ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో గురువారం సీఎం జగన్ స్పందించారు. విగ్రహాల విధ్వంసాన్ని తీవ్రంగా ఖండించారు.