కశ్మీర్‌ గుడిపై ఉగ్ర కుట్ర భగ్నం 

ఒక దేవాలయంపై పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రదాడిని జమ్ము, కశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. సరిహద్దు జిల్లా పూంచ్‌లోని మేంధార్‌ సెక్టార్‌లో బసూనికి సమీపంలో శనివారం రాత్రి ఒక వాహనంలో వెళ్తున్న ముస్తాఫా ఇక్బాల్‌ ఖాన్‌, ముర్తాజా ఇక్బాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 
 
వాళ్ల నుంచి ఆరు గ్రనేడ్లు, పాకిస్థానీలో రాసి ఉన్న బెలూన్లు, ఉగ్రవాదులకు సంబంధించిన పోస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా..  పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఒప్పుకొన్నారు. వారి ఆదేశాలతోనే ఆరి గ్రామంలోని ఆలయంపై గ్రనేడ్లతో దాడి చేయడానికి వెళుతున్నామని చెప్పారు. 
 
వీళ్ల సెల్‌ఫోన్లలో గ్రనేడ్‌ వాడకంపై వీడియోలు కూడా ఉన్నాయి. మత కలహాలను సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి ప్రణాళిక రచించారని ఆ ఇద్దరూ చెప్పారు. వీళ్లు ఇచ్చిన సమాచారంతో బాలాకోటే సమీపంలోని దబ్బి గ్రామంలో మరో ఇద్దరు.. ఉగ్రవాదుల మద్దతుదారులైన మహమ్మద్‌ యసీన్‌, రయీస్‌ అహ్మద్‌లను కూడా అరెస్టు చేశారు.