2025 నాటికి మరో 25 పట్టణాలకు మెట్రో

 డ్రైవర్ రహిత మెట్రోరైలును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు.  దేశంలోనే ఇది మొట్ట మొదటి రైలు. ఢిల్లీ మెట్రో కారిడార్‌లోని  పశ్చిమ జనక్‌పురి – బొటానికల్ గార్డెన్ మధ్య 37 కిలోమీటర్ల పొడవున్న మెజంటా లైన్‌లో ఈ రైలును మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 
2021 మధ్యనాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్‌ లైన్‌లో కూడా ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. డ్రైవర్‌ లేకుండా నడిచే రైళ్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7 శాతం మాత్రమే ఉన్నాయి. దేశంలో ఇదే మొదటి రైలు కావడం విశేషం. అదేవిధంగా నేషనల్‌ మొబిలిటీ కార్డును (ఎన్‌సీఎంసీ) కూడా ప్రధాని ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోలోని పది కారిడార్లలో మొదటిసారిగా ఎన్‌సీఎంసీ సేవలు వినియోగంలోకి రానున్నాయి. వన్‌ నేషన్‌ వన్‌ కార్డు నినాదంలో భాగంగా ఎన్‌సీఎంసీ సేవలను మోదీ ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ  దేశం ‘‘స్మార్ట్  వ్యవస్థ ’ దిశగా భారత్ ఎంత వేగంగా దూసుకెళ్తుందో చెప్పడానికి ఇదో తార్కాణమని పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో ఇప్పుడు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ద్వారా అనుసంధానించబడింద తెలిపారు. 
 
దేశంలో మొట్టమొదటి మెట్రో రైలు మాజీ ప్రధాని వాజ్‌పాయ్ చేసిన కృషి వల్ల సాధ్యమైందని గుర్తు చేసుకున్నారు. 2014 లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ సమయంలో కేవలం ఐదు పట్టణాల్లో మాత్రమే మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండేవని, కానీ నేడు 18 పట్టణాల్లో మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
 
2025 నాటికి మరో 25 పట్టణాలకు మెట్రోను విస్తరిస్తామని మోదీ ప్రకటించారు. మెట్రో రైళ్ల విస్తరణకు ‘మేక్ ఇన్ ఇండియా’ అత్యావశ్యకమని తెలిపారు. వీటి ద్వారా ఖర్చులు తగ్గుతాయని, విదేశీ కరెన్సీ తగ్గుతుందని, యువతకు మరింత ఉపాధి అవకాశాలు లభిస్తాయని మోదీ వివరించారు.