గోవధ నిషేధంపై కర్ణాటక ఆర్డినెన్సు 

గోవధ నిషేధ ఆర్డినెన్స్‌ ‘ప్రివెన్షన్​ ఆఫ్​ స్లాటర్​ అండ్​ ప్రిజర్వేషన్​​ ఆఫ్​ కాటిల్​ బిల్​-2020’కు కర్ణాటక కేబినేట్ ఆమోదించిందని ఆ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ తెలిపారు. 

గోవులను అక్రమంగా తరలించడాన్ని వధించడాన్ని నిషేధించేందుకు తాము కొత్తగా చట్టం చేయబోతున్నట్లు కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. దానికి అనుగుణంగానే తాజాగా ఆర్డినెన్స్‌ తీసుకువచ్చారు.

 ఈ ఆర్డినెన్స్‌కు సోమవారం రాష్ట్ర కేబినేట్ సమావేశమైంది. అనంతరం దీనికి కేబినేట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి ప్రభు ప్రకటించారు. ‘‘గోవధ నిషేధ ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. ఇది తొందరలోనే గవర్నర్ అనుమతికి వెళ్తుంది’’ అని మంత్రి ప్రభు చౌహాన్ పేర్కొన్నారు.

కర్ణాటకతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు సైతం గోవధ నిషేధంపై చట్టాలు చేయబోతున్నట్లు ప్రకటించాయి. ఎక్కడైనా, ఎవరైనా గోవులను చంపినా, వాటిపై హింసకు పాల్పడినా ఈ చట్టం ద్వారా వారికి కఠిన శిక్షలు విధించనున్నట్లు ఆయా ప్రభుత్వాలు పేర్కొన్నాయి.