నూతన వ్యవసాయ చట్టాలపై కేసీఆర్‌ కళ్లు  తెరిచారు 

 
నూతన వ్యవసాయ చట్టాలపై సీఎం కేసీఆర్‌ కళ్లు తెరిచారని అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హర్షం ప్రకటించారు. గత నాలుగు నెలలుగా కేసీఆర్ వ్యవసాయ  చట్టాలపై చేసిన విమర్శలు మార్చుకొని కొత్త చట్టాలకు కితాబు ఇవ్వడాన్ని బిజెపి స్వాగతిస్తోందని చెప్పారు.  ‘‘నూతన వ్యవసాయ చట్టాలపై గతంలో విమర్శలు చేసిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు కితాబు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా కళ్లు తెరిచి సాగు చట్టాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు సంకేతాలు ఇవ్వడం సంతోషం’’ అని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. 

కేసీఆర్‌ నియంతృత్వ ఆలోచన ద్వారానే నియంత్రిత సాగు తప్పనిసరి చేశారని మండిపడ్డారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించినందుకు సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నామని చెప్పి రైతులకు లాభం చేకూర్చే విషయంలో బాధ్యతల నుంచి తప్పుకొంటే ఊరుకోబోమని  సంజయ్హెచ్చరించారు.

‘మేం గత సంవత్సర కాలం నుంచి  నియంత్రిత సాగుచెయ్యడం తప్పని.. ఈ పద్ధతి ద్వారా రైతులు మరింత నష్టపోతారని, రైతులు వేసుకునే  పంటలకు స్వేచ్ఛనివ్వాలని ఎన్నిసార్లు  చెప్పినా కేసీఆర్ నియంతృత్వ  పోకడల ముందు  మా రోదన అరణ్యరోదనే అయ్యింది” అంటూ పేర్కొన్నారు. 
అయితే ఇప్పటికైనా కేసీఆర్ కళ్లుతెరచి కేంద్రం, భారత పార్లమెంట్ ఆమోదించిన  వ్యవసాయ చట్టాలను  తెలంగాణలో అమలు చేసేందుకు సంకేతాలు  ఇచ్చినందుకు సంతోషం ప్రకటించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో  రైతులకు మరింత లాభం చేకూర్చడానికి అనేక చర్యలు తీసుకోవాలని గతంలో చెప్పామని గుర్తు చేశారు.
2014లో ప్రధాని నరేంద్ర మోదీ  దేశంలోని  ప్రతి ఎకరా భూమికి భూసార పరీక్షలు నిర్వహించి, ఆభూమికి అనువైన  పంటలను  వేసుకునేందుకు రైతులకు అవగాహన  కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర  ప్రభుత్వాలదే అని స్పష్టం చేశారని గుర్తు చేశారు.  ఈ విషయంపై  తాము  నెత్తీనోరు కొట్టుకున్నా తెలంగాణలో భూసార  పరీక్షలు నిర్వహించకుండా కేసీఆర్ రైతులను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. 
 
రైతులకు అవగాహన  కల్పించాల్సిన వ్యవసాయ విస్తరణాధికారులను, వ్యవసాయ శాఖను బలోపేతం చేయకుండా కేసీఆర్ అడ్డుకున్నారని విమర్శించారు.  వ్యవసాయ యాంత్రీకరణ,  సూక్ష్మసేద్యం, విత్తనాలకు, పంటల బీమాకు  కేంద్రం సహాయం అందించినా వాటిని అమలు చేయడంలో, వాటిద్వారా తెలంగాణ రైతులకు లాభం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా  విఫలమైందని మండిపడ్డారు.
 
ఇప్పటికైనా రైతులను ఆదుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం భూసారపరీక్షలు మొదలుకొని మార్కెట్ యార్డుల వరకు సంస్కరించి రైతులకు నష్టం జరగకుండా  ఆదుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. 
తెలంగాణ  రాష్ట్రంలో ఐకేపీ కేంద్రాల  ద్వారా వడ్లతో పాటు  ఇతర ఆహార ఉత్పత్తులను  ఎంఎస్ పి రేటుకు కొనుగోలు చేయాలని మేం చాలాసార్లు డిమాండ్  చేశామని గుర్తు చేశారు. ఈ  ఐకేపీ కేంద్రాల నిర్వహణ లోపభూయిష్టంగా  ఉందని,  కమీషన్, తరుగు పేరుతో 20 శాతం దాకా రైతులకు నష్టం జరుగుతోందని తాము గతంలో అనేక సందర్భాల్లో చెప్పినా మా మాటలు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అయిందని విచారం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులను సంస్కరించి ఈనామ్ కు అనుసంధానం చేసి రైతులకు మెరుగైన లాభసాటి ధరను కల్పించేందుకు కృషిచేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. అంతేకాని మొత్తం భారాన్ని కేంద్రంపై నెట్టి చేతులు దులుపుకుంటే  ఊరుకునేది  లేదని హెచ్చరించారు. రైతులకు  లాభసాటి ధర  కల్పించేందుకు  రాష్ట్ర ప్రభుత్వమే తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
విత్తనాలు  మొదలు అమ్మకాల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలను అమలు చేయాలని , తద్వారా రైతులకు  మేలైన విత్తనాలు సరసమైన సమకూర్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణాధికారుల  నియామకంతో పాటు, వారు రైతులకు పంటల విషయంలో అవగాహన కల్పించేందుకు సమర్థవంతంగా పనిచేసే  ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని సూచించారు.
తెలంగాణ  రాష్ట్రంలో పత్తి, వరితో పాటు వేరుశెనగ, పొద్దుతిరుగుడు,  కందులు,  పెసళ్లు, శెనగలు, చెరకు, మిర్చి వంటి పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు  మరింత  లాభాలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలని సంజయ్ హితవు చెప్పారు.  దీంతోపాటు కూరగాయలు,  ఉద్యానవన పంటలను  కూడా ప్రోత్సహించేందుకు రైతులకు సబ్సిడీని సకాలంలో అందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.