మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరో ఆరుగురిని కమిషన్‌ సభ్యులుగా ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌, సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజునుంచి ఐదేండ్లపాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో వెల్లడించారు.

సునీత భర్త లక్ష్మారెడ్డి ఉమ్మడి మెదక్‌ జిల్లా గోమారం సర్పంచ్‌తోపాటు శివ్వంపేట జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. మెదక్‌ జిల్లా రైతుసంక్షేమం సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సునీత మామ రామచంద్రారెడ్డి 25 ఏండ్లపాటు సర్పంచ్‌గా, శివ్వంపేటకు ఎంపీపీగా పనిచేశారు. వీరి వారసురాలిగా సునీత 1999లో రాజకీయరంగ ప్రవేశం చేశారు.

నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి 1999లో తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే నియోజకవర్గంనుంచి మూడు పర్యాయాలు వరుసగా విజయం సాధించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మృదుస్వభావి, సహనశీలిగా పేరుగాంచిన సునీత 2019లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

కమిషన్‌లో సభ్యురాలిగా నియమితురాలైన గద్దల పద్మ ఉమ్మడి వరంగల్‌ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆమె అంగన్‌వాడీ టీచర్‌గా.. అంతకుముందు బీడీ కార్మికురాలిగా కూడా పనిచేశారు. భర్త నర్సింగరావు వరంగల్‌ జిల్లా నర్మెట్ట మండలంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు. పెద్దపల్లికి చెందిన రేవతిరావు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. నిజామాబాద్‌ పట్టణానికి చెందిన సూదం లక్ష్మి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు. ప్రజామోదంతో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.