మద్దతు ధర అంశంపై చర్చకు తావే లేదు 

మద్దతు ధర అంశంపై చర్చకు తావే లేదు 

కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అంశంపై చర్చకు అసలు తావే లేదని కేంద్రం స్పష్టం చేసింది. ’సాగు చట్టాలతో ధరల నిర్ణాయక వ్యవస్థ (ఎంఎస్పీ)కు ఎలాంటి సంబంధమూ లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫిక్స్‌డ్‌ రేటుకు పంట ఉత్పత్తుల సేకరణపైన కూడా వీటి ప్రభావం ఉండదు. చట్టాల ఉద్దేశమే వేరు. ఈ విషయాన్ని ఎన్నోమార్లు మీకు తెలియజేశాం’ అని తెలిపింది.  

అయినప్పటికీ ఎంఎస్పీపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ  చట్టాల పరిధిలో లేని ఎంఎస్పీ గురించిన ఏ డిమాండ్‌నైనా చర్చల్లో చేర్చడం సాధ్యం కాదని రైతులకు తాజాగా రాసిన లేఖలో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ తేల్చిచెప్పారు. 

 ప్రభుత్వం నిర్దిష్టమైన, ఖచ్చితమైన ప్రతిపాదనలతో వస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ఎంఎస్పీని చట్టబద్ధం చేసే ఆలోచన ఉంటేనే చర్చకు వస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా పేరిట ఏర్పాటైన 40 రైతు సంఘాలు బుధవారం కేంద్రానికి స్పష్టం చేయడంతో వివేక్‌ అగర్వాల్‌ ఈ సమాధానం పంపారు.  

రైతు నాయకులు “తార్కిక పరిష్కారాలు” చూషిస్తూ వస్తే అరమరికలు లేకుండా చర్చలకు ప్రభుత్వం సిద్దమే అని ఆయన స్పష్టం చేశారు. “మీరు మరే ఇతర విషయాలపై సంప్రదింపులు జరపాలని అనుకొంటున్నారో తెలపండి” అంటూ కోరారు. అక్టోబర్ 14న వ్యవసాయ కార్యదర్శికి వ్రాసిన లేఖలో రైతు నాయకులు ఐదు డిమాండ్ లను ముందుంచారు. వాటిల్లో మూడు కనీస మద్దతు ధరకు సంబందించినవి. మద్దతు ధరను నిర్ణయించడంలో స్వామినాధన్ కమీషన్ కమీషన్ సిఫార్స్ అమలు పరచాలని కోరుతున్నారు. 

అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించడం, ఆ ధర మార్కెట్ లో లభించని పక్షంలో ప్రభుత్వమే కొనుగోలు చేయడాన్ని చట్టబద్ధ హక్కుగా చేయాలని కోరుతున్నారు. అయితే మూడు నూతన వ్యవసాయ చట్టాలకు ఎంఎస్పీతో సంబంధం లేదని ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. రైతులు కోరుకొంటే దానిని కొనసాగిస్తామని వ్రాతపూర్వకంగా హామీ ఇస్తామని కూడా చెబుతున్నది.  

చట్టాలలో లేని అంశాలను ప్రస్తావించడం తగదని చెబుతూ, రైతులు కోరుకొంటే వాటిపై కూడా చర్చలకు సిద్ధమని ప్రభుత్వం వాదిస్తున్నది. ఇంతకు ముందు ఐదు సార్లు ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మూడు చట్టాలను రద్దు చేయాలని పట్టుబట్టడమే అందుకు ప్రధాన కారణం.