అవి రైతుల సంతకాలు కాదు…. రైతులే చెప్పారు 

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నట్లు కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కు సమర్పించిన వినతి పత్రంలో రాహుల్ గాంధీ చెప్పిన్నట్లు రెండు కోట్ల మంది రైతులు ఎవ్వరు సంతకాలు చేయలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఈ విషయం రైతులే తనకు చెప్పారని ఆయన వెల్లడించారు. 
 
“నన్ను కలిసిన రైతులు నాతో మాట్లాడుతూ ఏ కాంగ్రెస్‌ నాయకుడు తమ వద్దకు వచ్చి సంతకాలు తీసుకోలేదని చెప్పారు”అని ఆయన తెలిపారు.    రాహుల్‌గాంధీ ఏం చెప్పినా, ఆయనను ఆ పార్టీ నేతలే సీరియస్‌గా తీసుకోవట్లేదని ఎద్దేవా చేశారు.  అంతే కాకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోలేదని, ఇప్పుడు వారిపై ప్రేమను నటిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ వైఖరి ఎప్పటికీ రైతులకు వ్యతిరేకమేనని, ఇప్పుడు వారి మాటలు ఎవరూ నమ్మరని తోమర్ ధ్వజమెత్తారు. 

‘‘రాహుల్ గాంధీ ఏమైనా చెప్పుండొచ్చు. కానీ కాంగ్రెస్ ఇదే విషయాన్ని (రైతుల సమస్యలు) ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. ఈరోజు రైతుల సంతకాలతో రాష్ట్రపతి వద్దకు వెళ్లి నిరసన చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఎవరూ సంతకాల కోసం తమ వద్దకు రాలేదని రైతులే స్వయంగా నాతో చెప్పారు” అని తోమర్ తెలిపారు. 

రాహుల్ గాంధీకి నిజంగానే రైతులపై అంత ప్రేముంటే వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పనీ చేయలేదు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ వైఖరి ఎప్పటికీ రైతు వ్యతిరేకమే అని కేంద్ర మంత్రి తోమర్ దుయ్యబట్టారు.