గంభీర్‌ ‘జన్ రసోయి’ క్యాంటీన్లలో రూపాయికే ఆహారం

పేదలకు అతి తక్కువ ధరకే ఆహారాన్ని అందించేందుకు ‘జన్ రసోయి’ క్యాంటీన్లు సిద్ధమవుతున్నాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు ఢిల్లీలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కంటిలో కనీసం ఒక ‘జన్ రసోయి’ క్యాంటీన్‌ను తెరవాలని ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌  యోచిస్తున్నారు.
తొలి క్యాంటీన్‌ను గురువారం గాంధీనగర్‌లో గంభీర్‌ ప్రారంభించనున్నారు. రిపబ్లిక్‌ డే రోజున అశోక్‌నగర్‌లో మరొకటి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. కులం, మతం, లేదా ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నదని భావిస్తున్నట్లు తెలిపారు.
నిరాశ్రయులకు రోజుకు రెండు పూటలా భోజనం లభించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జన్‌ రసోయి క్యాంటీన్లకు ప్రాణం పోస్తున్నామని గంభీర్ చెప్పారు. ఢిల్లీలోని వస్త్ర మార్కెట్‌ అయిన గాంధీనగర్‌లో జన్‌ రసోయిని పూర్తి ఆధునిక క్యాంటీన్‌గా రూపొందించారు.
కేవలం రూపాయికే భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భోజనంలోకి బియ్యం, కాయధాన్యాలు, కూరగాయలు ఉండనున్నాయి. ఈ క్యాంటీన్లలో ఒకేసారి వంద మంది కూర్చునే సామర్ధ్యం కలిగివుండనున్నాయి. ప్రస్తుతం కొవిడ్‌ కారణంగా 50 మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టుకు గౌతమ్ గంభీర్ ఫౌండేషన్‌తోపాటు ఎంపీ వ్యక్తిగత వనరుల నుంచి నిధులు సమకూరుస్తున్నారు.  పలు రాష్ట్రాలలో కూడా క్యాంటీన్లను ప్రారంభించి సబ్సిడీతో ఆహారాన్ని అందిస్తుండగా  దేశ రాజధానిలో రూపాయికే భోజనం పెట్టాలని గౌతం గంభీర్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.