ఉద్యోగ నోటిఫికేషన్‌ ఒక ఎన్నికల డ్రామా   

ఉద్యోగ నోటిఫికేషన్‌ ఒక ఎన్నికల డ్రామా అని, నిరుద్యోగుల ఓట్ల కోసమే కేసీఆర్‌ పేపర్‌ ప్రకటన చేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్‌ ఓట్ల కోసమే నోటిఫికేషన్‌ డ్రామాకు తెరలేపారని ఆరోపించారు.
 
పోలీస్, విద్య శాఖలలో దాదాపు 50,000 ఖాళీలను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అనుమతి ఇచ్చిన్నట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ  కేసీఆర్‌కు నిజంగా నిరుద్యోగులపై చిత్తశుద్ది ఉంటే అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సంజయ్ డిమాండ్‌ చేశారు.
 
 బీజేపీ ఆందోళనను ముందుగానే పసిగట్టి భయంతో నోటిఫికేషన్‌ అని పేపర్‌ ప్రకటన చేశారని విమర్శించారు. నోటిఫికేషన్‌ తప్పుల తడకగా ఇచ్చి కోర్డుల ద్వారా రద్దు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసమే కేసీఆర్‌ కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. 
 
కేసీఆర్‌ మాయల పకీరు మాటలు విని మోసపోయే రోజులకు కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల కడుపుమంట లో కేసిఆర్ కాలిపోయే రోజులు వచ్చాయని బండి సంజయ్‌ విమర్శించారు.