నడ్డాపై దాడికి ముగ్గురు ఐపిఎస్ అధికారులదే బాధ్యత

పశ్చిమ బెంగాల్‌లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాపై జరిగిన దాడికి కేంద్రం నుంచి ఆ రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వెళ్లిన ముగ్గురు ఐపిఎస్ అధికారులు బాధ్యులని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో నడ్డాతో సహా ఇతర బిజెపి నాయకులు ఉన్న వాహనాలపై దాడి జరిగిన విషయం తెలిసిందే.

డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని షిరాకోల్‌లో బిజెపి నాయకుల వాహన శ్రేణిపై దాడి జరిపిన సమయంలో వారికి భద్రతగా డైమండ్ హార్బర్ ఎస్‌పి భోలానాథ్ పాండే, దక్షిణ బెంగాల్ అదనపు డిజిపి రాజీవ్ మిశ్రా, ప్రెసిడెన్సీ రేంజ్ డిప్యుటీ ఐజి ప్రవీణ్ త్రిపాఠిలను కేంద్రం డిప్యుటేషన్‌పై పంపింది. 

నడ్డా భద్రతపట్ల నిర్లక్ష్యం వహించిన ఆ ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను డిప్యుటేషన్‌పై వెనక్కి రమ్మంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు,   ఇది రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయమని ఆరోపిస్తూ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు లేఖ రాశారు.

కాగా, డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం డైమండ్ హార్బర్‌లో నడ్డా పర్యటిస్తుండగా ఈ దాడి జరిగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్తలు జరిపిన రాళ్ల దాడిలో నడ్డాతోపాటు రాష్ట్ర పార్టీకి చెందిన అగ్రనాయకులు, కార్యకర్తలు సైతం గాయపడ్డారని బిజెపి ఆరోపించింది.

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వరీయ, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, జాతీయ కార్యదర్శి అనుపమ్ హజ్రా కూడా ఈ రాళ్ల దాడికి కార్ల అద్దాలు పగిలి గాయపడినట్లు బిజెపి తెలిపింది.