కేరళ పోలింగ్ బూత్‌లో ఓటర్లకు రోబోట్ సేవలు

కేరళ ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు సహాయంగా రోబోట్లను రంగంలోకి దించారు. కేరళ రాష్ట్రంతో తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సహాయ పడేలా రోబోలను వినియోగించారు. 
 
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్థుత తరుణంలో కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లా ఎన్నికల అధికారులు త్రికక్కర మున్సిపల్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు విశిష్ఠ సేవలందించేందుకు వీలుగా సయాబోట్ అనే రోబోను రంగంలోకి దించారు. 
 
పోలింగ్ కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ‘సయాబోట్’ రోబో ఓటు వేసేందుకు కేంద్రానికి వచ్చిన ఓటర్లను పలకరించి వారి శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేసి, ఓటు వేసే ముందు వారికి శానిటైజర్లను ఇచ్చింది.  ఓటరుకు నిర్దిష్టంగా సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే రోబో ప్రకటన చేసి పోలింగ్ అధికారిని సంప్రదించమని ఓటరుకు సలహా ఇచ్చింది. ఓటర్లు ఫేస్ మాస్కు సరిగ్గా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని రోబో సలహా ఇచ్చింది.
 
 ఓటర్లు శానిటైజర్ లేకుండా పోలింగ్ కేంద్రానికి వస్తే రోబో వారి చేతులను శుభ్రం చేసేందుకు శానిటైజర్ ఇస్తుందని ఎర్నాకుళం జిల్లా కలెక్టరు ఎస్ సుహాస్ చెప్పారు. పోలింగ్ కేంద్రంలో రోబో సేవలను ప్రయోగాత్మకంగా ప్రవేపెట్టి పరిశీలించామని, తర్వాత ఇతర పోలింగ్ కేంద్రాల్లోనూ ఈ రోబోలను ప్రవేశపెడతామని కలెక్టరు చెప్పారు.